-
రూ.6 వేల కోట్లతో 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి
-
దశాబ్ద కాలంగా యువ వికాసాన్ని విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం
-
మార్చి 15 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
-
ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తుల పరిశీలన లబ్ధిదారుల ఎంపిక
-
జూన్ 2న ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ
-
కార్యాచరణ ప్రణాళిక వెల్లడించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
రాజీవ్ యువ వికాసం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు రూ.6 వేల కోట్లతో ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి పథకాలు అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ వీర వనిత చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.
యువత వికాసం గురించి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదని, ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దోహదపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి పథకాలు అందకపోవడంతో ఇబ్బందులు పడ్డారని వివరించారు.
ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి 3 లక్షల చొప్పున సాయం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ సంవత్సరం స్వయం ఉపాధి పథకం అందించడానికి ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. స్వయం ఉపాధి పథకం కొరకు ఆన్ లైన్లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఏప్రిల్ 6 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేస్తామని వివరించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన మార్గదర్శకాలను అధికారులు రూపొందిస్తున్నారని చెప్పారు. సామాజిక స్పృహ కలిగిన ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించడం సామాజిక బాధ్యతగా తీసుకున్నదన్నారు.
చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ.540 కోట్లు :
వీరవనిత చాకలి ఐలమ్మ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం రూ.540 కోట్లు కేటాయించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి అద్భుతమైన నిర్మాణాలు చేయడానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసిందని ఈ సందర్భంగా తెలిపారు. యూనివర్సిటీలో ఉన్న హెరిటేజ్ భవనాలను పునరుద్ధరణ చేస్తామన్నారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం మూసి రివర్ను ఆనుకొని ఉందని మూసి పునర్జీవం అయిన తర్వాత యూనివర్సిటీ ప్రధాన ద్వారాన్ని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15.5 కోట్లు, అదేవిధంగా నూతన భవన నిర్మాణాలకు తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.
హెరిటేజ్ భవనాలు, పునరుద్ధరణ ప్రణాళికలను అధికారులతో కలిసి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్వయంగా పరిశీలించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణా రావు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీష్, ఐలమ్మ యూనివర్సిటీ వీసీ సూర్య ధనుజయ తదితరులు పాల్గొన్నారు.