- పిఎం శ్రీ పథకంలో మరో 1514 పాఠశాలలకు అవకాశం ఇవ్వండి
- పూర్వోదయ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు చేయండి
- కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు మంత్రి లోకేష్ విజ్ఞప్తి
ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళణాన్ని (All India Education Ministers’ Conclave) ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుచేసే అవకాశం కల్పించాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్ కోరారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు. విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వమని లోకేష్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కాన్క్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. ఎపిలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రతి పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అధిక బడ్జెట్ కేటాయింపు అవసరం. 2025-26 బడ్జెట్ లో ఎపికి అత్యధికంగా నిధులు కేటాయించాలని కోరారు. పిఎం శ్రీ ఫేజ్ -1,2 లలో కలిపి ఎపిలో ప్రతిపాదించిన 2,369 పాఠశాలలకు గాను 855కు మాత్రమే మంజూరయ్యాయి. గతంలో సిఫార్సు చేసిన మిగిలిన 1,514 పాఠశాలలను ఫేజ్ – 3 పిఎం శ్రీలో మంజూరు చేయమని అడిగారు. అలాగే యూనివర్సిటీ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుదలకు రూ.180కోట్లు మంజూరు చేయండి. రీసెర్చి, ఇన్నొవేషన్, అకడమిక్ ఎక్సలెన్స్ హబ్ గా ఎపిని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద మొత్తంగా రూ.5,684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి విజ్ఞప్తిచేశారు.
ఎపిలో ఎన్ సిసి డైరక్టరేట్ ను ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్ లో మానవవనరుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఎన్ సిసి మౌలిక సదుపాయాల వృద్ధి ద్వారా ఎపిలోని క్యాడెట్లకు మెరుగైన అవకాశాలను కల్పించేందుకు సహకారం అందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లోని 5 ఎన్ సిసి గ్రూపులు, 43 యూనిట్ల పరిధిలో 75వేలమందికి పైగా క్యాడెట్లు ఉన్నారు, రాష్ట్ర విభజన తర్వాత ఎన్ సిసి డైరక్టరేట్ తెలంగాణాలో ఉండిపోయిందని ఎపిలో ప్రత్యేకంగా ఎన్ సిసి డైరక్టరేట్ ను ఏర్పాటు చేయమని అడిగారు. ఎపి రాజధాని అమరావతిలో ఇందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.