మంగళగిరి ఎయిమ్స్ అసుపత్రి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఉదయం 8.35 గంటలకు రాష్ట్రపతి ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరతారు. ఉదయం 11.30 గంటలకు గన్నవరం విమానాశ్రాయానికి చేరుకోనున్న ఆమె అక్కడి నుంచి నేరుగా మంగళగిరి ఎయిమ్స్ లో జరిగే స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. స్నాతకోత్సవంలో 49 మంది ఎంబీబీఎస్ విద్యర్థులకు పట్టాలు అందజేస్తారు. వారిలో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు బహుకరిస్తారు. ఈ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీయం చంద్రబాబు, డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ లు పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం గన్నవరం చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ పయనమవుతారు.
రాష్ట్రపతి శీతాకాల విడిది…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో శీతాకాల విడిది చెయ్యడానికి సోమవారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. బుధవారం రాష్ట్రపతి నిలయంలో వివిధ కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు పలు నిర్మాణాలకు శంకుస్ధాపన చేస్తారు. డిసెంబర్ 20వ తేదీన కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కు రంగులను అందజేస్తారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రంలోని ప్రముఖులు, విద్యావేత్తలు, తదిరులకు రాష్ట్రపతి నిలయంలో ఎట్ హమ్ రిసెప్షన్ నిర్వహిస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.