-
రాష్ట్ర ప్రభుత్వం, రాహుల్ గాంధీ పేరిట పూజలు
-
జాతరలో చిన్న నాటి మిత్రులతో కలసి మిఠాయిలు కొనుక్కొని సందడి
-
మహాశివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారంతా క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఆయన శ్రీమతి మల్లు నందినితో కలిసి స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మిపురంలోని పురాతన శివాలయంలో, మధిర నియోజకవర్గ కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కుటుంబం పేరిట దేవాలయాల్లో పూజలు చేయించారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని ఆయన పూజలు నిర్వహించారు. స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో శివపార్వతుల పూజ అనంతరం జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో చిన్ననాటి మిత్రులతో కలిసి కలియతిరిగారు. మిఠాయిలు కొనుగోలు చేసి మిత్రులకు పంచుతూ ఆనందంగా గడిపారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.