వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట ఉదయమే విజయవాడలోని తమ నివాసంలో ఆర్థిక శాఖ అధికారులతో కలిసి పయ్యావుల కేశవ్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఏఎస్,ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే. నివాస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు.
తన నివాసంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం బడ్జెట్ ప్రతులతో అమరావతిలోని వెంకటాయపాలెం వద్ద టీటీడీ ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు పయ్యావుల కేశవ్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలని ఈ సందర్భంగా స్వామివారిని మంత్రి పయ్యావుల వేడుకున్నారు. పూజల అనంతరం బడ్జెట్ ప్రతులతో మంత్రి పయ్యావుల అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
అసెంబ్లీకి వెళ్లిన వెంటనే కేబినెట్ సమావేశం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను మంత్రి అందజేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు బడ్జెట్ ప్రతులను అందజేశారు. కేబినెట్ సమావేశం ముగియగానే.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు బడ్జెట్ ప్రతులను పయ్యావుల కేశవ్ అందజేశారు. మొత్తం రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టనుంది.