రంజాన్ మాసంలో పాకిస్తాన్లో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిష్టగా ఉపవాసం ఉండాల్సిన ఈ సమయంలో బెలుచిస్థాన్ అట్టుడుకుతోంది. నిత్యావసరాల ధరలు పెరగటంతో ప్రజలు ఈద్ ఎలా చేసుకునేదని గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో రాజధాని ఇస్లామాబాద్లో ఏకంగా యువకులు లూటీకి పాల్పడ్డారు.
అనధికారికాంగా నిర్వహిస్తున్న నకిలీ కాల్ సెంటర్పై దాడి చేసిన పాక్ నిఘా సంస్థలు…అది చైనీయులదని తేల్చాయి. తనిఖీలు పూర్తి చేసి అధికారులు వెళ్లిపోగానే స్థానిక యువత కాల్ సెంటర్పై దండెత్తారు. అందినకాడికి దోచుకున్నారు.
ఇస్లామాబాద్లోని సెక్టార్ ఎఫ్-11లో ఉన్న కాల్ సెంటర్ హబ్పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA) అధికారులు తనిఖీలు నిర్వహించారు. విచారణలో కాల్ సెంటర్ చైనీయులు ఆపరేట్ చేస్తున్నట్లు తేలింది. కాల్ సెంటర్ నుంచి ఫ్రాడ్ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇస్లామాబాద్ కేంద్రంగా ఆ కాల్ సెంటర్ స్కామ్లు నడిపిస్తున్నట్లు తేలడంతో ఆ సెంటర్పై FIA అధికారులు తనిఖీ చేపట్టారు. చైనీయులు ఆ రాకెట్ నడుపుతున్నట్లు గుర్తించారు. రెయిడ్ తర్వాత మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో విదేశీయులు కూడా ఉన్నారు. కొందరు పరారీ అయినట్లు తెలుస్తోంది.
అధికారుల బృందం వెళ్లిపోగానే సెంటర్లోని ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, మానిటర్లు, కీబోర్డులు, ఎక్స్టెన్సన్లు.. ఏదిపడితే అది యువకులు ఎత్తుకెళ్లారు. ఫర్నీచర్, కట్లరీ సెట్లను కూడా లూటీ చేశారు.
లూటీపై ఎక్స్ అకౌంట్లో కొందరు వీడియోలు పోస్టు చేశారు. వందల సంఖ్యలో ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ పరికాలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కాల్ సెంటర్ను దోచుకోవడాన్ని ఛారిటీ డ్రైవ్గా మరో యూజర్ పేర్కొన్నాడు.
పాకిస్తాన్ ప్రభుత్వం చైనాతో అంటకాగుతుంటే ప్రజల్లో డ్రాగన్ వ్యతిరేకత తీవ్రం అవుతోంది. పాక్ వనరులు దోచుకుంటున్న చైనా…కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పాకిస్తాన్తో స్నేహం నటిస్తోందని ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి.
బలుచిస్థాన్, ఖైబర్ ఫంక్త్వువా, బాల్టిస్తాన్ రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న చైనా వ్యతిరేకత క్రమంగా పంజాబ్, సింద్ రాష్ట్రాలకు కూడా పాకుతోంది. పాకిస్తాన్ పాలకులు మేల్కోపోతే త్వరలోనే దేశం ముక్కలు చెక్కలు కావటం తథ్యమని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.