ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి బ్రేక్ పడింది.. ఇక గన్ల గర్జనలు, బాంబు దాడులు ఆగిపోతాయి అనుకునే సమయంలో మరో బాంబ్ పేల్చారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. ఒప్పందంలో చెప్పినట్టుగా హమాస్ 33 మంది బందీలను విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆ 33 మందిలో మహిళలు, వృద్ధులు, వ్యాధులు, గాయాలతో ఇబ్బందులు పడుతున్నవారు ఉండాలని ఇప్పటికే ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఆ 33 మంది పేర్ల లిస్ట్ ముందుగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. అలా జరగకపోతే ఒప్పందం అమల్లోకి రాదని తేల్చి చెబుతున్నారు.
ఒప్పందంలో చెప్పినట్టుగా బందీల వివరాలు ముందుగానే ఇవ్వాలి. ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగితే మేం అంగీకరించం. ఈ బాధ్యతను హమాస్ మర్చిపోకూడదు… అంటూ చెబుతున్నారు నెతన్యాహు. ప్రస్తుతం హమాస్ చెరలో 98 మంది ఇజ్రాయెల్ బంధీలు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 33 మంది రిలీజ్ కానున్నారు. ఈ 33 మందికి బదులుగా 2000 మంది పాలస్తీనాకు చెందిన వారిని రిలీజ్ చేయనుంది ఇజ్రాయెల్. ఈ ఒప్పందం ఆదివారం ఇజ్రాయెల్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:30 అమల్లోకి రానుంది. మొదటి ఫేజ్లో మొత్తం 42 రోజుల పాటు కాల్పుల విరమణ ఉంటుంది. రెండు వారాల్లో సెకండ్ ఫేజ్కు సంబంధించిన చర్చలు మొదలవుతాయి.
ఈ ఒప్పందం అమల్లోకి వస్తే 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డ్ పడనుంది. ఈ సమయంలో గాజా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దాదాపు 42,000 మంది మరణించినట్టు తెలుస్తోంది.