ఆదిలాబాద్ జిల్లా ఖేస్లాపూర్ లో నిర్వహించనున్న నాగోబా జాతరకు, నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో చేపట్టనున్న వసంత పంచమి ఉత్సవాలకు రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖని దేవాదాయ శాఖ ఆహ్వానం అందింది. ఈ మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, బాసర ఆలయ ఇంఛార్జి కార్యనిర్వహణాధికారి ఎన్. నవీన్ కుమార్, సహాయ కార్యనిర్వహణాధికారి ఆర్. సుదర్శన్, వేదపండితులు మంత్రి సురేఖని హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. నాగోబా జాతర, వసంత పంచమి ఉత్సవ ఆహ్వాన పత్రికను మంత్రికి అందించి, వేడుకలకు ఆహ్వానించారు.
జనవరి 28 నుంచి 31 వరకు నాగోబా జాతర, ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు వసంత పంచమి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మంత్రి సురేఖకి తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు ఉత్సవ ఆహ్వానపత్రికను మంత్రికి చదివి వినిపించారు. వేదపండితులు మంత్రి సురేఖకి అమ్మవారి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాలను అందించి, వేదాశీర్వచనం చేశారు. ఆలయ సిబ్బంది, అర్చకులతో కలిసి మంత్రి సురేఖ బాసర జ్ఞాన సరస్వతి వసంత పంచమి ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు శ్రీ నవీన్ శర్మ, సంజయ్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.