- కులగణనలో మున్నూరు కాపుల సంఖ్యను తగ్గించారు
- త్వరలో మున్నూరు కాపుల భారీ బహిరంగ సభ
- వీహెచ్ నివాసంలో సమావేశమైన ఆల్ పార్టీ మున్నురు కాపు నేతలు
భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీల్లో కాపులకు దక్కిన ప్రాధాన్యత కాంగ్రెస్ లో కరువయ్యిందని మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు నివాసంలో మున్నేరు కాపు నేతల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కీలక మున్నూరు కాపు నేతలు హజరైన ఈ సమావేశంలో కులగణన సరిగా చెయ్యలేదని, మున్నూరు కాపుల సంఖ్యను తగ్గించి చూపించారని అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మున్నూరుకాపు నేతలకు కీలక పదవులు ఇచ్చింది..అంతే విధేయతతో పనిచేశామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసిఆర్ కూడా మున్నూరు కాపులు అవసరాన్ని గుర్తించి రెండు సార్లు మంత్రి వర్గంలో తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగానే కాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా కేసీఆర్ అవకాశం కల్పించారని నేతలు అన్నారు. అలాగే బీజేపీ కూడా మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ నుంచి దక్కినన్ని ఎమ్మెల్యే, ఎంపి టికెట్లు కాంగ్రెస్ నుంచి రాలేదని నామినేటెడ్ పోస్టు్లో కూడా అన్యాయం జరుగుతోందని నేతలు అభిప్రాయపడ్డారు. డి.శ్రీనివాస్, కేకే, వి.హెచ్, పొన్నాల లకు దక్కిన స్థాయి నేడు కాంగ్రెస్ లో లేదని నేతల అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అంశం పై కూడా ఈసమావేశంలో చర్చించారు. మల్లన్న ఎత్తుకున్న నినాదం కరక్టే కానీ పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఒక బీసీ నేతపైనే కాకుండా పార్టీ లైన్ దాటిన ఇతర సామాజికవర్గాలకు చెందిన నేతలపై కూడా ఇదే రకమైన చర్యలు ఉండాలని మున్నూరు కాపు నాయకులు అభిప్రాయం వెలిబుచ్చారు. కులగణన చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతగా సభ పెడతామని ఈ సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రతిపాదన పెట్టగా ఇతర మున్నూరు కాపు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్నూరు కాపులు మంత్రివర్గంలో లేకపోవడం ఇదే తొలిసారని నీకు మంత్రి పదవి ఇస్తే కృతజ్ఞత సభ పెడతామని మున్నూరు కాపు నాయకులు స్పష్టం చేశారు. కృతజ్ఞత సభకు బదులు మున్నూరు కాపుల భారీ బహిరంగ సభ నిర్వహించాలని వీహెచ్ నివాసంలో జరిగిన సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన మున్నూరు కాపు నాయకులు నిర్ణయం తీసుకున్నారు.