లగచర్ల ఆందోళనల్లో పాల్గొన్న రైతులకు బెయిల్ లభించింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మంది రైతులకు ఈ రోజు(బుధవారం) నాంపల్లి క్రిమినల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డికి రూ. 50 వేల పూచీకత్తుపై, మిగతా వారికి రూ. 20 వేల పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇచ్చింది.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా ప్రాజెక్టు కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వగా… అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లారు. భూములు ఇవ్వమని తేల్చిచెప్పిన రైతులు కలెక్టర్, ఆర్ డి ఓ పై దాడికి దిగారు. లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి ఘటనపై ఆ రోజు అర్ధరాత్రి నుంచి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేయటం విమర్శలకు దారితీసింది.
నవంబర్ 13వ తేదీన ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు 55 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం 24 మంది రైతులను హాజరుపరచగా వారికి కోర్టు రిమాండ్ విధించింది. వారందరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు.