ఈ నెల 26వ తేదీ హైదరాబాద్లో నిర్వహించనున్న బయోఏషియా-2025 కార్యక్రమానికి రావల్సిందిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు ఆహ్వానించారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని మంత్రి శ్రీధర్బాబు ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు తదితర అంశాలపై శ్రీధర్బాబు కేంద్ర మంత్రితో చర్చించారు. బయోఏషియా — 2025 కార్యక్రమానికి జీవవిజ్ఞాన రంగంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, పాలసీ మేకర్లు, పారిశ్రామిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని పీయూష్ గోయల్ని మంత్రి శ్రీధర్బాబు కోరారు. తెలంగాణలో జీవవిజ్ఞాన రంగ అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ప్రశంసిస్తూ, ఈ కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు.
తెలంగాణలో మేగా లెదర్ పార్కుల ఏర్పాటు కోసం శ్రీధర్బాబు కేంద్ర సహాయం కోరారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ గ్రామంతో పాటు జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ గ్రామం వద్ద మెగా లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ పార్కుల అభివృద్ధికి అవసరమైన సామూహిక కర్బన వ్యర్థాల శుద్ధి కేంద్రాలు సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం పారిశ్రామిక ప్రోత్సాహక విధానాల విభాగం నుంచి కేంద్ర సహాయాన్ని మంత్రి శ్రీధర్బాబు కోరారు.
జహీరాబాద్ నోడ్ ప్రగతిపై సమీక్ష – నిధుల విడుదలకు విజ్ఞప్తి
జాతీయ పారిశ్రామిక మార్గ అభివృద్ధి సంస్థ పరిధిలోని జహీరాబాద్ నోడ్ అభివృద్ధి పై కూడా మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రితో చర్చించారు. ప్రస్తుత పురోగతిని వివరించి, మిగిలిన అనుమతుల మంజూరు, నిధుల విడుదల త్వరితగతిన చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఓసాకా ఎక్స్పో 2025లో తెలంగాణ పాల్గొననున్నట్లు అధికారికంగా ధృవీకరణ
అంతర్జాతీయ వేదికగా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు, పరిశ్రమల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు 2025లో జపాన్లో జరుగనున్న ఓసాకా ఎక్స్పో లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు అధికారికంగా తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖను ఆయనకు అందజేశారు.