భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం తెల్లవారు జామున 5.44 గంటలకు మాధవానంద స్వామి సరస్వతీ నది పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించి తొలి పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సతీసమేతంగా హాజరై సరస్వతీ నదికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం వేకువ జామునే కాళేశ్వరం నుంచి మంగళ వాయిద్యాలతో సరస్వతీ నదికి వెళ్లి గణపతి పూజ నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. పంచ కలశాలతో ఆవాహన పూజ నిర్వహించి పుష్కరునుకి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. ఈ రోజు ప్రారంభమైన సరస్వతీ నది పుష్కరాలు ఈనెల 26వ తేదీ వరకూ కొనసాగుతాయి. సాయంత్రం సీయం రేవంత్ రెడ్డి దంపతులు సరస్వతీ పుష్కరాలకు విచ్చేయనున్నారు. కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం దగ్గర సరస్వతీ పుష్కరఘాట్ ని ప్రారంభించనున్నారు. అనంతరం సీయం దంపతులు పుష్కర స్నానమాచరిస్తారు.