విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇంట్రడక్షన్ అవసరం లేని లెజెండ్స్. బట్ ఇప్పటి పరిస్థితులు మాత్రం వేరేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించేసిన ఈ ఇద్దరు.. ఇక టెస్ట్ క్రికెట్కు కూడా బైబై చెప్పే సమయం వచ్చేసిందన్న ప్రచారం మొదలైంది. ఎందుకంటే వీరిద్దరు టెస్ట్ మ్యాచ్ల్లో వరుసగా ఫెయిల్ అవుతున్నారు. ఇక బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో వీరిద్దరూ విఫలమయ్యారు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ రోహిత్ను పెవిలియన్ కు పంపాడు. వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతికి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. ఇక కోహ్లీ అయితే కేవలం 3 పరుగుల వద్ద హెజిల్ వుడ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దీంతో ఇద్దరిపై మరోసారి విమర్శలు మొదలయ్యాయి.
బోర్డర్ గవాస్కర్ సిరీస్లో రోహిత్శర్మ మొదటి మ్యాచ్ ఆడలేదు. అడిలైడ్ ఓవల్లో జరిగిన రెండో టెస్టులో రోహిత్ 3, 6 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు 10 పరుగులు చేసి అవుటయ్యాడు. గత 13 టెస్టు ఇన్నింగ్స్ల్లో రోహిత్ ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. ఆ ఇన్నింగ్స్ లలో స్కోర్లు 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10. 2024 సీజన్లో రోహిత్ తొలి ఇన్నింగ్స్లో సగటు 8.85 మాత్రమే.
ఇక రికార్డుల రారాజుగా పేరు సాధించిన విరాట్ కోహ్లీది కూడా ఇదే సీన్. తన నుంచి పెద్ద ఇన్నింగ్స్ లు రావడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్లో జరిగిన ఓపెనింగ్ టెస్ట్లో కేవలం 5 పరుగులు చేసిన తర్వాత, అతను రెండో ఇన్నింగ్స్లో అద్భుతమైన సెంచరీని సాధించాడు. ఆ తర్వాత అడిలైడ్లో జరిగిన రెండో టెస్టులో మళ్లీ ఫ్లాప్ షోనే కంటిన్యూ చేశాడు. రెండు ఇన్నింగ్స్ లలో వరుసగా 7, 11 పరుగులు మాత్రమే చేశాడు. బ్రిస్బేన్ గబ్బా టెస్టులో 3 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ను పూర్తి చేశాడు.
అయితే కోహ్లీ వైఫల్యం వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరి ఉంది. 2024లో టెస్టుల్లో కోహ్లి 15 సార్లు ఔటయ్యాడు. ఇందులో 12 ఆఫ్ స్టంప్ వెలుపల డెలివరీలకే ఔటై పెవిలియన్కు చేశాడు. ఈ 12 కూడా ఫ్రంట్ ఫుట్ నుంచి డెలివరీలు ఆడాలని చూస్తున్నప్పుడే జరిగాయి. నిజం చెప్పాలంటే కోహ్లీని ఎలా అవుట్ చేయాలన్నది ఓపెన్ సీక్రెట్గా మారిపోయింది. నిజానికి అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ సెంచరీలకు దగ్గరగా ఎవరూ లేరు. కానీ టెస్టుల్లో ఫ్యాబ్-4 జాబితాలో కోహ్లీ అట్టడుగు స్థానంలో ఉన్నాడు. పెర్త్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసినప్పటికీ, కోహ్లి టెస్టుల్లో అతని పేరు మీద ఇప్పటికీ 30 సెంచరీలు ఉన్నాయి, ఇది ఈ జాబితాలో అత్యల్పంగా ఉంది.
అందుకే విరాట్, రోహిత్ల రిటైర్మెంట్ గురించి పదే పదే ప్రస్తావన వినిపిస్తోంది. నిజానికి వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ ఆడిన తర్వాత వీరిద్దరు టెస్టులకు వీడ్కోలు పలుకుతారని అంతా అనుకున్నారు. కానీ వీరితో పాటు టీమిండియా ఫ్లాప్ షో చూస్తుంటే అసలు మన టీమ్ ఫైనల్స్కు వెళ్లే చాన్సే కనిపించడం లేదు.