తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన మంగళవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. తెలుగువారితో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది.
వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఈ వాహన సేవలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ, పోలీసు శాఖ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.