తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు కడపలో జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. మరో నాలుగు దశాబ్దాల పాటు పార్టీ మనుగడ సాధించేలా కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులను మహానాడులో భాగస్వామ్యం చేయనున్నారు.
నందమూరి హీరోలను భాగస్వాములను చేయాలని టిడిపి హై కమాండ్ భావిస్తోంది. అందులో భాగంగా చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు, కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ను మహానాడుకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ దిశగా నందమూరి బాలయ్య చొరవ తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2009 ఎన్నికల్లో టిడిపి గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు. పార్టీ కార్యక్రమాలతో పాటు మహానాడులోనూ పాల్గొన్నారు. 2014లో ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.
తరువాత క్రమేపి పార్టీతో పాటు కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. 2024 ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ పేరు తరచూ పార్టీలో వినిపించేది. జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకోవాలని కేడర్ కోరేది. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీతో పాటు నందమూరి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు ముఖ్య నేతలు జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉండడం… వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలపై టిడిపి అంచనాలకు తగ్గట్టు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆగ్రహానికి కారణమైంది.
2024 ఎన్నికల్లో టిడిపి గెలిచిన తర్వాత చంద్రబాబుతో పాటు లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించడంపై జూనియర్ ఎన్టీఆర్ను అందరూ అభినందించారు. ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు పిలిస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం జూనియర్ పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. రాజకీయ ప్రకటనలు కూడా చేయడం లేదు. ఈ తరుణంలో జూనియర్ ఎన్టిఆర్ మహానాడుకు పిలుపు వచ్చినా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.