- నాకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానమే హామీ ఇచ్చింది
- మంత్రి పదవి ఇస్తే కిరీటంలా కాదు బాధ్యతగా వ్యవహరిస్తా
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మునుగోడు శాసనసభ్యుడు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత కుందూరు జానారెడ్డిపై కోమటిరెడ్డి నోరు పారేసుకున్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రసంగిస్తూ హాట్ హాట్ కాంమెంట్లు చేశారు. తన విషయంలో కొందరు నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధర్మరాజు వంటి జానారెడ్డి కూడా దృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తోందని వ్యాఖ్యానించారు. పది మందికి పనికి వచ్చే మనిషిని, వెయ్యిమందిని కాపాడే మనస్తత్వం ఉన్న నాలాంటి వ్యక్తికే అడ్డం తగుతుతుండంటే ఏమనాలో అర్ధం కావడం లేదని అన్నారు. నన్ను చూస్తే అందరూ భయపడుతున్నారన్న రాజగోపాల్ రెడ్డి అధిష్టానమేమో ఇస్తా అంటోంది కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఒకాయన అంటాడు ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తామని… ఒకే ఇంట్లో యూసుఫ్ పటాన్, ఇర్ఫాన్ పటాన్ ఇద్దరు అన్నదమ్ములు క్రికెటర్లుగా ఉన్నపుడు ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
జానారెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మంత్రి పదవి అనుభవించారు అప్పుడు గుర్తురాని రంగారెడ్డి, హైదరాబాదులు ఇప్పుడు గుర్తు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఏ మంత్రి పార్లమెంటు సభ్యుడిని గెలిపించారు.. అన్ని పార్లమెంటు స్ధానాలకు మంత్రులను ఇన్ఛార్జులుగా పెడితే భువనగిరికి ఒక శాసనసభ్యుడ్ని అయిన నన్ను ఇన్ఛార్జ్గా నియమించారని చెప్పుకొచ్చారు. నాకే కెపాసిటీ లేకపోతే నన్ను ఇన్ఛార్జ్గా ఎందుకు పెట్టారు. నాకు గెలిపించే సత్తా ఉంది… ప్రజల్లోకి వెళతాడు అనే కదా నాకు బాధ్యత అప్పగించింది… అప్పుడు మాట ఇచ్చి నెరవేర్చడం లేదన్నారు. ఒకరి దయాదాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు మంత్రి పదవి ఇస్తారా అని మేము ఎదురు చూడటం లేదని, నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటంలాగా కాకుండా బాధ్యతగా వ్యవహరిస్తా అని రాజగోపాలరెడ్డి స్పష్టం చేశారు. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే, నిజాయితీగా ప్రజలకోసం పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకే మంత్రి పదవులు ఇవ్వాలి. ఈ పైరవీకారులను పక్కన పెట్టాలని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.