- విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి.కుమారస్వామి
- వైఎస్.జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి అడ్డుకున్నారని వ్యాఖ్య
విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మివేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అప్పటి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో కేంద్రప్రభుత్వం ముందుకు వెళ్లలేకపోయిందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్డి.కుమారస్వామి తేటతెల్లం చేశారు. విశాఖ ఉక్కు పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారస్వామి శుక్రవారం మీడియా ముందుకు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. వాస్తవానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ (దిపం) విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటికరించాలని నిర్ణయం తీసుకుందని, కేంద్రప్రభుత్వం కూడా ఆదిశగా అడుగులు వేసినప్పటికీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ఒక చర్య వల్ల అప్పట్లో విశాఖ స్టీల్స్ని ప్రైవేటీకరించలేకపోయామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని అందువల్ల విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రప్రభుత్వం వెనకడుగు వేయాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. అప్పట్లో కరోనా సమయంలో కూడా విశాఖ స్టీల్స్ 930 కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ ప్లాంటును ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుందని. అయితే జగన్ మాత్రం ఎంతమాత్రం ఒప్పుకోకుండా పైవేటీకరణ చేయవద్దని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని స్వయంగా కుమారస్వామే మీడియాకు తెలియజేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం విశాఖ స్టీల్స్కు కేంద్రప్రభుత్వం ప్రకటించిన 11,440 కోట్ల ప్యాకేజీపై ఉద్యోగులు, విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. విశాఖ స్టీల్స్ లాభాల్లో ఉన్నప్పటికీ దానిని విక్రయించాలని ఒక క్రమపద్దతితో నాసనం చేస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. దాదాపు 1500 రోజులుగా వారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్నారు. ఈ ప్యాకేజి కేవలం జీతాలు, బిల్లుల బకాయిలు తీర్చడానికి మాత్రం సరిపోతుందిని, నిజంగా విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చెయ్యకుండా ప్రభుత్వరంగ సంస్ధగానే కొనసాగించాలనే చిత్తశుద్ధి కేంద్రప్రభుత్వానికి ఉంటే సెయిల్లో విలీనం చెయ్యాలని ఉద్యోగులు, వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నార. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకు క్యాపిటీవ్ మైన్స్ ఉన్నాయని ఒక్క విశాఖ స్టీల్స్కే లేవని, సెయిల్లో విలీనం చేస్తే ఆ సమస్య కూడా తీరిపోతుందని ప్లాంట్ ఉద్యోగులు అంటున్నారు.