కెనడాలోని ఒట్టావా సమీపంలోని రాక్ ల్యాండ్లో ఒక భారతీయ పౌరుడు కత్తిపోట్లకు గురై మృతి చెందినట్లు భారత హై కమిషన్ శనివారం వెల్లడించింది. ఈ సంఘటనలో నిందితుడిని కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కెనడాలోని భారత దౌత్యకార్యాలయం ప్రకటించింది. అయితే మృతి చెందిన భారత పౌరుడి వివరాలు మాత్రం బహిర్గతం కాలేదు. అలాగే నిందితుడి పేరు కూడా పోలీసులు ప్రకటించలేదు. స్థానిక కమ్యూనిటీ ద్వారా మృతి చెందిన వ్యక్తి బంధువులకు సహాయం అందిచడానికి భారత దౌత్య కార్యాలయం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల కాలంలో కెనడాలో నివసిస్తున్న భారత సంతతిపై దాడులు పెరుగుతున్నాయని కెనడియన్ భారత సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2024వ సంవత్సరం డిసెంబర్ మాసంలో జరిగిన మూడు సంఘటనల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. డిసెంబర్ 1వ తేదీన లూధియానాకు చెందిన గురాసిస్ సింగ్ అనే యువకుడు తన రూమ్ మీట్ క్రాస్లీ హంటర్ చేతిలో కత్తిపోట్లకు గురై మరణించాడు. అలాగే డిసెంబర్ 6వ తేదీన హర్యానాకు చెందిన విద్యార్థి హర్షన్ దీప్ సింగ్ అంటాల్… ఆల్బెర్టాలోని ఎడ్మంటన్లో హత్యకు గుర్యాడు. అదే నెల 14వ తేదీన కెనడాలో సిమ్రంజిత్ కౌర్ అనే యువతి కత్తిపోట్లకు గురయ్యి మరణించింది.