మయన్మార్, థాయిలాండ్లలో భూకంపం వల్ల సంభవించిన భయంకరమైన విధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మయన్మార్, థాయిలాండ్లలో భూకంపం తర్వాత పరిస్థితి గురించి తాను ఆందోళన చెందుతున్నానని ఆయన అన్నారు. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానన్నారు. భారతదేశం అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో, భారత్ అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు కొనసాగించడం గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖతో చర్చ జరిగింది.
మయన్మార్లో సంభవించిన భూకంపం కారణంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో సంభవించిన విధ్వంసం హృదయ విదారకంగా ఉంది. మయన్మార్ను 7.7, 6.4 తీవ్రతతో భూకంపాలు తాకాయి. దీని కేంద్రం రాజధాని నగరానికి వాయువ్యంగా కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగింగ్ సమీపంలో ఉంది. మయన్మార్ భూకంపంలో వందలాది భవనాలు కుప్పకూలాయి. శిథాలాల కింద చిక్కుకున్న వేలాది మందిని బయటకు తీసేందుకు సహాయక చర్చలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఏళ్ల చరిత్ర ఉన్న అవా బ్రిడ్జి సైతం నేలమట్టమైంది. థాయ్లాండ్లో వందల బౌద్దరామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అన్ని విమాన సర్వీసులను రద్దు చేసి.. ఎయిర్పోర్ట్ను లాక్డౌన్ చేశారు. భూకంపం ఎఫెక్ట్తో ఇటు బ్యాంకాక్లో ట్రైన్లు సైతం ఊగాయి. దీంతో బ్యాంకాక్లో మెట్రో, రైలు సేవలు పూర్తిగా నిలిపివేశారు.
మయన్మార్ భూకంపం ఎఫెక్ట్తో భారత్లోనూ పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. మేఘాలయా, కోల్కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూమి కంపించింది. ఇంఫాల్లో భయాందోళనతో జనం పరుగులు తీశారు. మేఘాలయాలో భూకంప తీవ్రత 4.0గా నమోదైంది.