బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కక్షగట్టి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని, కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కేసులకు వ్యతిరేకంగా కొట్లాడడానికి పార్టీ పరంగా లీగల్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో నిజాలను ప్రచారం చేసినా, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినా కాంగ్రెస్ ప్రభుత్వం సహించడం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఈ రకంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు.
కోరుట్ల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్సీ డాక్టర్ సంజయ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా పోటీపడి తిట్లు తిడుతున్నారని, కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవి… ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని అన్నారు. “కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి… కేసీఆర్ ఒక వేగుచుక్క. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్.”
తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో కష్టాలకోర్చి పనిచేసిన చరిత్ర అని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ తట్టుకొని నిలబడిందని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా అదే స్పూర్తిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసే వారే నిజమైన కార్యకర్తలని తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను, హామీలను విస్మరించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు.