29.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

జర్నలిస్టులకు ఎప్పుడూ అండగానే ఉంటా – మంత్రి పొంగులేటి

– జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం చేస్తా
– రాష్ట్రానికే ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ళు రోల్ మోడల్

భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు, లీగల్ ఇష్యూస్ రాకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేదే తమ అభిమతమని రాష్ట్ర రెవిన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం లోని మంత్రి పోంగులేటి క్యాంప్ కార్యాలయం లో తనని కలిసిన జర్నలిస్టులతో మంత్రి పొంగులేటి సుదీర్ఘంగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి, తాను ఇదే సంకల్పతో ఉన్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇద్దామని అనుకున్నామని , అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని , దీంతో ప్రక్రియ ఆగిపోయిందని తెలిపారు. జర్నలిస్టులలో పేద, బీద , బలహీన వర్గాలకు చెందిన వారే ఉంటారని, మీరు చెల్లించే డబ్బులు తీసుకోవడం ప్రభుత్వానికి పెద్ద విషయమేమీ కాదని, అయితే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చేసిన తర్వాతే తీసుకుంటామని స్పష్టం చేశారు. అది కూడా ఎంతో దూరంలో లేదని, ఇప్పటికే ప్రభుత్వం ఓ కసరత్తు చేస్తుందని, ఖమ్మం జిల్లా నుంచే ఆ ప్రక్రియను మొదలు పెడతామని హామీ ఇచ్చారు. రెవెన్యూ , సమాచార శాఖలకు చెందిన మంత్రిగా ఇప్పటికే తనకు స్పష్టత ఉందని, అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఏ పద్ధతిలో చేస్తే జర్నలిస్టు సమాజానికి మేలు జరుగుతుందో , అదే పద్ధతిని అనుచరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి.. కొంతమంది తన చెవిలో జోరీగ లాగా ఎన్ని చెప్పినా వినిపించుకోలేదని, భవిష్యత్తులో కూడా వినిపించుకోనని కుండ బద్దలు కొట్టారు. తాను, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడు జర్నలిస్టుల పక్షానే ఉంటామని మరో మారు స్పష్టం చేశారు. జర్నలిస్టులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసిన మంత్రి పొంగులేటి.. భవిష్యత్తులో కూడా ఇదే సహకారాన్ని కొనసాగిస్తానని చెప్పారు. జర్నలిస్టుల ముఖ్య నాయకులు, మూడు ప్రధాన సంఘాలు ఇంత పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతి కొద్ది రోజుల్లోనే శుభవార్త వింటారని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో ఫోన్ సంభాషణ జరిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పై స్పష్టమైన విధివిధానాలను , ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు. జర్నలిస్టు ప్రతినిధి బృందం వచ్చి కలుస్తుందని వారితో చర్చించి న్యాయపరమైన లాంటి చిక్కులు లేకుండా భవిష్యత్తులోనూ సమస్యలు రాకుండా ఉండే విధానాన్ని రూపొందించాలని సూచించారు. అనంతరం మూడు సంఘాల ప్రధాన నేతలతో కూడిన జర్నలిస్టు ప్రతినిధి బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామ నారాయణ, టి యు డబ్ల్యూ టి జే ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, టి .డబ్ల్యు.జే.ఎఫ్ జిల్లా అధ్యక్షులు పల్లా కొండలరావు, ఐజేయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు,స్తంభాద్రి హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్, కోశాధికారి బిక్కి గోవర్ధన్‌తో పాటు.. జర్నలిస్ట్ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com