- వివాదాస్పదం అవుతున్న సీనియర్ నేతల వ్యాఖ్యలు
- తీన్మార్ మల్లన్న నుంచి మొదలుకొని అంజన్ కుమార్ యాదవ్ వరకు
- పార్టీని ఇరుకున పట్టే విధంగా ప్రకటనలు
- రెడ్డి సామాజిక వర్గంపై కామెంట్స్ ను సీరియస్గా తీసుకుంటున్న అధిష్టానం
- త్వరలోనే యాక్షన్ ప్రారంభించనున్న మీనాక్షి నటరాజన్
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఒకవైపు విపక్షాల నుంచి ప్రతిరోజు విమర్శలను ఎదుర్కొంటూ వాటికి సమాధానం ఇస్తున్న అధికార పార్టీకి సొంత పార్టీ నేతల వ్యాఖ్యలు ప్రకటనలు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ అని ప్రచారం చేసుకున్న ఈ స్థాయిలో పార్టీ లైన్ ను దాటి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నేతల విషయంలో సైలెంట్ గా ఉండడం సరైనది కాదని సీనియర్లు అంటున్నారు. తీన్మార్ మల్లన్న నుంచి మొదలుకొని అంజన్ కుమార్ యాదవ్ వరకు వీళ్ళ వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారడంతో పాటు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి.
ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల నుంచే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చాలా విషయాల్లో బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. బీసీ కుల గణన నుంచి మొదలుకొని తాజాగా ఎస్ఎల్బీసీ వ్యవహారం వరకు… ఇలా ప్రతిరోజు ఏదో ఒక విషయంపై సొంత పార్టీని సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మరో ముఖ్య నేత జీవన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా వివాదంగా మారుతోంది. చాలా రోజుల నుంచి అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి ఎక్కడ అవకాశం వచ్చినా తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కడానికి వెనుకడుగు వేయడం లేదు.
మరో నేత చిన్నారెడ్డి అత్యంత సీనియర్ నేతగా చెప్పుకుంటారు. స్వయంగా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డి కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో ఉన్న వివాదాన్ని ఆయన బహిరంగంగానే వ్యక్తపరుస్తూ కామెంట్లు చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన మరో ముఖ్య నేత అంజన్ కుమార్ యాదవ్ తాజాగా చేసిన కామెంట్స్ తారస్థాయికి చేరాయి. ఆది నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఒక సామాజిక వర్గాన్ని టార్గట్గా చేస్తూ ఆయన కామెంట్స్ చేశారు. రెడ్లు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ఈ రకమైన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకి నెగటివ్గా మారుతున్నాయి. బీసీ కుల గణన వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని రాజకీయంగా ఆలోచించిన కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు మరోవైపు నుంచి నెగటివ్ ప్రచారానికి దారితీస్తున్నాయి. జూనియర్లైతే పర్లేదు కానీ ఏకంగా సీనియర్ నాయకులు ఈ రకంగా మాట్లాడితే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందనే వాదన వినిపిస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా మీనాక్షి నటరాజ వచ్చిన నేపథ్యంలో ఈ విషయాలన్నీ ఆమె దృష్టిలో పెట్టాలని నేతలు భావిస్తున్నారు. గీత దాటిన వారిపై యాక్షన్ తప్పదని ఇప్పటికే ఆమె కొంతమంది సీనియర్ల వద్ద వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది.