నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఓ ఇంటి ముందు పురపాలక సంఘం సిబ్బంది ధర్నా చేయటం కలకలం సృష్టించింది. ఆస్తి పన్ను చెల్లించాలని ఇంటి ముందు బైఠాయించి మున్సిపల్ అధికారుల నిరసన తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో మున్సిపల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆస్తిపన్ను వసూలు చేస్తుండగా.. ఓ ఇంటి యాజమాని ఆస్తి పన్ను నాలుగేళ్లుగా కట్టక పోవడంతో సుమారు రూ. లక్షకు పైగా బకాయి పేరుకుపోయింది.
ఆస్థి పన్ను చెల్లించాలని సిబ్బంది కోరగా సదరు యజమాని వాయిదా వేశారు. ప్రతిసారి వాయిదాల పేరుతో పన్ను కట్టడం లేదని సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఇంటి యజమాని ఇవేవి పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్లిపోయారు. దీంతో ఆస్తి పన్ను చెల్లించాలని అధికారులు ఆ ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో ఇదే విధంగా శాంతియుత పద్ధతుల్లో నిరసనకు దిగితే కోశాగారం పటిష్టమవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.