హైదరాబాద్ సిటీతో పాటు.. నగర శివారు ప్రాంతాల్లో ప్లాట్లను విక్రయించేందుకు మరోసారి హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పలు ప్రాంతాల్లో విలువైన ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసింది. ప్రధానంగా కోకాపేట, మోకిలా, తొర్రూర్, బహదూర్పల్లి తదితర ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఆన్లైన్లో భూములను వేలం వేసింది. ఈ వేలంలో కోకాపేటలోని భూములు రికార్డు స్థాయి ధర పలికాయి. కోకాపేటో ఏకంగా ఎకరం భూమి విలువ రూ.100 కోట్లు ధర పలికింది. అయితే, అప్పట్లో తొర్రూర్లో 117 ఎకరాల్లో 1000 ప్లాట్లతో హెచ్ఎండీఏ వెంచర్ వేసింది. అందులోని కొన్ని పాట్లు అమ్ముడుపోయాయి. బహదూర్పల్లిలో 40 ఎకరాల్లో 101 ప్లాట్లు, మోకిలలో 165 ఎకరాల్లో 1321 ప్లాట్లు వేలంలో అమ్ముడు పోయాయి. అవన్నీ కూడా భారీగా ధర పలికాయి. అయితే, తొలి వాయిదా చెల్లింపు విషయంలో చాలామంది చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం ఈ లే అవుట్లలో 80 శాతం ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని గుర్తించి మరోసారి వేలం వేసేందుకు హెచ్ఎండీఏ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, కోకాపేట తదితర ప్రాంతాల్లో భూములు రికార్డు ధర పలకటం వెనక కుట్ర ఉందనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ప్రైవేటు భూములు ఉన్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా అక్కడ ధరలు పెంచేందుకు ఆన్లైన్లో అధిక ధరకు కోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆయా ప్రాంతాల్లోని భూములు, ప్లాట్ల ఆన్లైన్ వేలానికి సంబంధించి ప్రస్తుతం నిర్ణయం తీసుకోవడానికి హెచ్ఎండీఏ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్పై మార్కెట్లో స్తబ్దత నెలకొనడంతో ఆ ప్రభావం వేలంపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు రూ.20 వేల కోట్ల వరకు అవసరమని అంచనా వేశారు. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 1000 ఎకరాలకు పైగానే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కొన్ని లే అవుట్లలో ప్లాట్లు విక్రయించగా.. అందులో కొన్నింటికి డబ్బులు చెల్లించకపోవడంతో కేటాయింపులు రద్దు చేశారు. ఇలాంటి ప్లాట్లను ఇప్పటివరకు 500 వరకు గుర్తించగా.. వీటిని విక్రయించి రూ.1000 కోట్లు ఆర్జించాలని ఫ్లాన్ చేస్తోంది హెచ్ఎండీఏ. ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంటుండగా.. పూర్తిస్థాయిలో ఊపు వచ్చిన తర్వాత వేలం వేస్తే మంచి డిమాండ్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రధానంగా ప్రభుత్వం వేలం వేసే భూములతో సమస్య ఉండదు. చిక్కులేమీ లేకుండా.. క్లియర్ టైటిల్తో ఉంటాయి. దీంతో, మార్కెట్ ధరకు కొనుగోలు చేసినా నష్టమేమీ లేదనుకుంటారు. అయితే, ప్రభుత్వాలు వేలం వేసే భూములు పరిమితంగా ఉంటాయి. పైగా.. వేలం వేసిన భూములు కొందామన్నా సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉంటాయి. ప్లాట్ల విస్తీర్ణం పెద్దగా ఉండటంతో పెద్ద పెద్ద సంస్థలు, కార్పొరేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనేందుకు అనువుగా ఉంటాయన్న పేరుంది. అయితే, ఈసారి వేలం ప్రక్రియ నిర్వహిస్తే.. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మార్చి ఒకటో తేదీన ఈ వేలం ప్రక్రియ ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్లాట్లను వేలం వేయడానికి హెచ్ఎండీఏ ఏర్పాట్లు పూర్తి చేసింది. వంద శాతం చిక్కులు లేని, క్లియర్ టైటిల్ ఉన్న ఈ ప్లాట్లను కొన్నవారు.. సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉంటుంది.