ఔరంగజేబ్ సమాధి అంశం ఇప్పుడు మహారాష్ట్రలో అగ్గి రాజేసింది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ ఇప్పుడు ఆందోళనలు మొదలయ్యాయి. హిందూ సంఘాలు ఈ ఆందోళనలను రోజురోజుకు ఉధృతం చేస్తున్నాయి. అయితే నాగ్పూర్లోని ఓ ఏరియాలో ర్యాలీ నిర్వహిస్తున్న VHP కార్యకర్తలపై ఓ వర్గం యువకులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది. మరో వర్గానికి చెందిన పవిత్రమైన గ్రంధాన్ని దహనం చేస్తున్నారంటూ పుట్టించిన పుకారు.. ఈ గందరగోళానికి కారణమైంది. ఓ అల్లరి మూక రెచ్చిపోయింది. వాహనాలను ధ్వంసం చేస్తూ నిప్పు పెట్టారు. చూస్తుండగానే పరిస్థితి అదుపు తప్పింది.
పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసులపై కూడా రాళ్ల దాడి చేయడంతో ఈ మొత్తం వ్యవహరంలో 30 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 60 మంది అల్లరి మూకలకు చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ మొత్తం వ్యవహారం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముందుగానే సీసీ కెమెరాలు ధ్వంసం చేసి.. ఆ తర్వాత బీభత్సం సృష్టించారని చెబుతున్నారు. ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్ను డైవర్ట్ చేయడానికి ఈ విధ్వంసకాండ చేశారనేది వారి ఆరోపణ.
సాయంత్రం 5 గంటల సమయంలో సోషల్ మీడియా గ్రూపుల్లో కొన్ని బుక్స్ను తగలబెడుతున్న వీడియోలు వైరలయ్యాయి. వీటిని చూసిన ఓ వర్గం యువకులు వీధుల్లో గూమికూడటం ప్రారంభించారు. ఆ తర్వాత వేలల్లో వీధుల్లోకి వచ్చిన యువకులు.. ఇక తమ విధ్వంసకాండను ప్రారంభించారు. వందకు పైగా సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ వీడియోలను కావాలనే వైరల్ చేసినట్టు మహారాష్ట్ర సైబర్ వింగ్ పోలీసులు గుర్తించారు.
నాగ్పూర్లోని అనేక విధుల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. పరిస్థితి అంతా అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ఎవరైనా పుకార్లు నమ్మవద్దని.. శాంతంగా ఉండాలని.. చట్టానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు.