ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నామని.. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. ఈ పరీక్షలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని చెప్పారు. 2022లో నోటిఫికేషన్ ఇచ్చామని, గత వారంలో సుప్రీంకోర్టు, హైకోర్టు కేసుల నుంచి విముక్తి లభించడంతో పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1358 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం పరీక్షల నిర్వహణలో 49,848 మంది సిబ్బంది పాలు పంచుకుంటారన్నారు. పరోక్షంగా అందరితో కలిపి మొత్తం 75 వేలమంది సిబ్బంది పరీక్షల రోజు విధుల్లో ఉంటారన్నారు. 75 శాతం మంది అభ్యర్థులు ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. 783 పోస్టులకు పరీక్ష జరుగుతోందని, ఒక్కో ఉద్యోగానికి 70 మంది చొప్పున పరీక్షకు హాజరవుతున్నారన్నారు. ఆ ఒక్క పోస్ట్ నాదే అనే కాన్ఫిడెన్స్ తో పరీక్ష రాయాలని అభ్యర్థులకు టీజీపీఎస్సీ చైర్మన్ సూచించారు. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, మెరిట్ వచ్చేలా చూసుకోవాలని.. కాన్ఫిడెన్స్తో పరీక్ష రాస్తే ఉద్యోగం మీదే అని చెప్పారు. ఓఎమ్ఆర్ షీట్ ను అభ్యర్థులు పక్కాగా చెక్ చేసుకోవాలని సూచించారు. బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాసేందుకు వీలు లేదన్నారు. గతంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినపుడు భర్తీకి నాలుగేళ్ల సమయం పట్టిందని, ఈసారి అలా కాకుండా తక్కువ సమయంలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని బుర్రా వెంకటేశం చెప్పారు. గ్రూప్ 2 నిర్వహణకు తాము పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామ్నారు. అభ్యర్థులు.. టీజీపీఎస్సీని, వాళ్ల మెరిట్ను నమ్ముకోవాలని భరోసా ఇచ్చారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఉంటాయని, 58 స్టోరేజీ పాయింట్లలో ఓఎమ్ఆర్ షీట్లు, ప్రశ్న పత్రాలు ఉంటాయన్నారు. అభ్యర్థులకు తప్ప అందులో ఏ ప్రశ్నలు ఉన్నాయో ఎవరికీ తెలియదని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అభ్యర్థులకు భరోసా ఇచ్చారు.