రెండు రోజులు పాటు జరగనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-2 పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 783 పోస్టులకు సంబంధించి ఆది, సోమవారాల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5లక్షల 57వేల మంది అభ్యర్థలు గ్రూప్-2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 1,368 పరీక్షా కేంద్రాల్లో టీజీపీఎస్సీ గ్రూ-2 పరీక్షలు నిర్వహిస్తోంది. గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి, డిపెంబర్ 15వ తేదీ ఆదివారం రెండు పేపర్లకు ఉదయం, సాయంత్రం పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి 12.30 గంటల వరకూ మొదటి పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకూ రెండో పరీక్ష ఉంటుంది. పరీక్షా సమయానికి అరగంట ముందు వరకూ మాత్రమే అభ్యర్ధులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను లోనికి అనుమతించరు. అయితే ఆదివారం ప్రారంభమైన మొదటి పరీక్షకు చాలా కేంద్రాల వద్దకు ఉదయం 6 గంటలకే అభ్యర్ధులు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల బీఎన్ఎస్ సెక్షన్ 163 యాక్ట్ అమలు చేస్తున్నారు. గర్భవతులు, చంటి పిల్లలతో పలువురు అభ్యర్ధులు గ్రూప్-2 ఎగ్జామ్స్ రాయడానికి వస్తున్న దృశ్యాలు పరీక్షా కేంద్రాల వద్ద కనిపిస్తున్నాయి.