ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని సీయంని కోరిన సీపీఐ
ఐదు స్థానాలకుఈ నెలలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మె్ల్సీ ఎన్నికల్లో తమకు కనీసం ఒక ఎమ్మెల్సీ స్థానాన్నైనా కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తెలంగాణ సీపీఐ నాయకులు కోరారు. కొత్తగూడెం సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో సీపీఐ బృందం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. సాధారణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెలసీ ఎన్నికలు స్థానికంగా నెలకొన్న పరిస్ధితు ప్రభావంపై జరుగుతాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఈఎన్నికల్లో ప్రభావం చూపించవని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. అనంతరం తమకు ఎమ్మెల్సీ సీట్లలో ప్రాధాన్యత ఇవ్వాలని సీయంని సీపీఐ బృందం కోరింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, సీపీఐల మధ్య భవిష్యత్తులో సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్ధానాలు ఇస్తామని జరిగిన ఒప్పందాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి సీపీఐ బృదం గుర్తి చేసింది. ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో తమకు కనీసం ఒక్క ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని సీయంని వారు కోరారు. సీపీఐ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధిష్టానంతో ఈ విషయమై మాట్లాడతానని హామీ ఇచ్చారు.