మన దేశ ప్రజల శక్తి సామర్థ్యాలే భారత్కు ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకొస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపుతుందని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే, 2014 నుంచి పదేళ్ల కాలంలో పార్లమెంట్ సెషన్కు ముందు విదేశీ జోక్యం కనిపించలేదని కానీ ఈ సారి మాత్రమే కనిపిస్తోందని విపక్షాలకు చురకలు అంటించారు.
పేదలు మరియు సామాన్య ప్రజలపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. భారతదేశం యొక్క శక్తి, సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయన్నారు. మూడోసారి ఎన్డీఎకు ప్రజలు అధికారాన్ని అప్పగించారని, మూడోసారి పార్లమెంట్లో సంపూర్ణ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ వార్షిక బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపుతుందని ఆకాంక్షించారు. భారతదేశ అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడ్లో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇన్నోవేషన్, ఇన్క్లూజన్, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామన్నారు ప్రధాని మోదీ. కొత్త విధానాలపై ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని, పార్లమెంట్లో చరిత్రాత్మక బిల్లులను ప్రవేశపెడుతున్నామన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని, ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నానని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెడతారు. శనివారం కేంద్ర బడ్జెట్ను ఆమె సభకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలు రెండు ఫేజ్లుగా శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతాయి. మొదటి ఫేజ్ ఫిబ్రవరి 13వ తేదీ వరకు, రెండో ఫేజ్ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.