జమిలి ఎన్నికలు చట్టమై అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబానాయుడు స్పష్టం చేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా పార్టీ మద్దతు ప్రకటించిందని తెలిపారు. వైఎస్సార్సీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోందన్నారు. ఆ పార్టీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని, వారి నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళతామన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ పై వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదని భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్నారు. ఈసారి జరిగే కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తామని సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు సమాధానాల రూపంలో నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అద్వానీతో నాకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని ఆస్పత్రిలో చేరిన అద్వానీ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
- Advertisement with us -