అంతా అనుకున్నట్టే ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ మొదలైంది. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచదేశాలపై విధించిన టారిఫ్ల విషయంలో కొన్ని దేశాలు మౌనంగా ఉన్నా మరికొన్ని దేశాలు కౌంటర్లు ప్రారంభించాయి. ఈ విషయంలో మొదటి వరుసలో ఉంది డ్రాగన్ కంట్రీ చైనా. ఎంతైతే చైనాపై అమెరికా టారిఫ్ విధించిందో అంతే టారిఫ్ను అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ విధించింది చైనా. ఈ నిర్ణయం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ఇప్పటికే చైనాకు సరుకు రవాణ ప్రారంభమై.. మార్గం మధ్యలో ఉండి మే 13 వరకు చేరుకుంటే వారికి మాత్రం పెంచిన టారిఫ్ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది చైనా. ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతులపై ఉన్న టారిఫ్లకు అదనంగా ఈ కొత్త టారిఫ్లు ఉండనున్నాయి.
నిజానికి ట్రంప్ టారిఫ్లు అనౌన్స్ చేయగానే చైనా స్పందించింది. తాము కూడా ప్రతీకార టారిఫ్లు విధిస్తామని తెలిపింది. దానికి తగ్గట్టుగానే ప్రతిస్పందించింది కూడా. నిజానికి ఈ నిర్ణయం ఎంత మేర ఎఫెక్ట్ చూపుతుందో చూడాలి. ఎందుకంటే చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులే ఎక్కువ. ప్రతి ఏడాది చైనా నుంచి అమెరికాకు 438 బిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. అదే సమయంలో అమెరికా నుంచి చైనాకు దిగుమతి అయ్యే వస్తువుల విలువ 143 బిలియన్ డాలర్లు.
ఆసియాన్, ఐరోపా సమాఖ్యల తర్వాత అత్యధికంగా చైనా వస్తువులు అమెరికాకే ఎగుమతి అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో అమెరికా, -చైనాల మొత్తం వాణిజ్యం విలువ 582.4 బిలియన్ డాలర్లు. అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకొనే వస్తువుల విలువ 143.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
నిజానికి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే చైనాపై 20 శాతం టారిఫ్లు విధించారు. తాజాగా 34 శాతం విధించారు. దీంతో మొత్తం 54 శాతం టారిఫ్లు విధించినట్టైంది. ఈ టారిఫ్లు 438 బిలియన్ డాలర్ల వ్యాపారంపై ఎఫెక్ట్ చూపుతుంది. మరి అమెరికన్లు చైనా నుంచి దిగుమతులు తగ్గించి ఇతర దేశాలపై మొగ్గు చూపుతారా? లేక అధిక ధరలకు వాటిని కొనుగోలు చేస్తారా? లేక సొంతంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారా? అనే దానిపైనే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైందా? కాదా? అనేది ఆధారపడి ఉంటుంది.