ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రాజధాని నగరాన్ని మరో మూడేళ్లలో ప్రజల వినియోగానికి తీసుకురావాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అదే సమయంలో విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ఈ దిశగా ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఫలితంగా విజయవాడ నుంచి విశాఖకు రాకపోకలు పెరిగాయి. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం సుదీర్ఘంగా మారడంతో పాటు, రైలు మార్గంలోనూ ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో విమాన సర్వీసుల అవసరం అనివార్యంగా మారింది. అయితే, ఇప్పటివరకు విజయవాడ నుంచి విశాఖకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేవు. దీంతో, ఈ అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ దృష్టి సారించింది.
విజయవాడ నుంచి విశాఖకు నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జూన్ 1వ తేదీ నుంచి నూతన విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ప్రతి రోజూ ఉదయం 7:15కు విజయవాడ నుంచి బయలుదేరి, 8:25కు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ నుంచి ఉదయం 8:45కు బయలుదేరి, 9:45కు విజయవాడకు చేరుకుంటుంది. ఇప్పటివరకు విజయవాడ నుంచి చెన్నై మీదుగా విశాఖకు వెళ్లే విమానమే అందుబాటులో ఉండగా, అధిక రద్దీ కారణంగా ప్రయాణికులు హైదరాబాద్ మీదుగా ప్రయాణించాల్సి వచ్చేది. ఈ కొత్త సర్వీసు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికుల రవాణా భారం తగ్గనుంది.