-
వెలగపూడి సెక్రెటేరియట్ వెనకాల భూమి కొనుగోలు
-
పూర్తయిన మట్టి పరీక్షలు, సర్వేలు
-
ఏప్రిల్ 9వ తేదీన భూమిపూజ, నిర్మాణం ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో సొంత ఇల్లు నిర్మించుకోబోతున్నారు. ఏకంగా ఐదు ఎకరాల స్థలంలో చంద్రబాబు తమ నివాసం కోసం ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నారు. వెలగ పూడి సెక్రెటేరియట్ వెనకాల ఇప్పటికే ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు చంద్రబాబు.. ఈ స్థలంలో ఇంటి నిర్మాణానికి అవసరమైన మట్టి పరీక్షలు, సర్వేలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 9వ తేదీన ఈ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత ఇంటి నిర్మాణం ప్రారంభమవుతుంది.
గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. రాష్ట్ర రాజధాని అమరావతిలో సొంతిల్లు నిర్మాణానికి ఆలోచన చేసిన చంద్రబాబు.. తనకు సరైన స్థలాన్ని ఎంచుకొని కొనుగోలు చేశారు. వెలగపూడికి సమీపంలో ఉన్న E-6 రోడ్డుపై ఐదు ఎకరాల భూమిని ఆయన కొంతకాలం క్రితం కొన్న విషయం తెలిసిందే. ఈ భూమిపై ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏప్రిల్ 9వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అలాగే, ఏప్రిల్ 15వ తేదీ తర్వాత అమరావతిలో నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఆరేళ్లుగా ఆగిపోయిన అమరావతి నిర్మాణ పనులకు ప్రధాని మోదీ మరోసారి శంకుస్థాపన చేయనున్నారు.
చంద్రబాబుకు అమరావతిలో సొంత ఇల్లు లేకపోవడం గురించి తరచూ విమర్శలు వస్తున్నాయి. ఎక్కడో హైదరాబాద్లో ఉంటూ అమరావతిలో పాలన చేస్తారా? అన్న ఆరోపణలు తలెత్తాయి. ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లిలోని ఇల్లు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు చెందినది. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటికైతే ఆయన నివసిస్తున్న ఉండవల్లిలోని ఇల్లును ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అదే సమయంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ఇల్లు కాకుండా.. సొంతంగానే ఇంటి నిర్మాణం చేపట్టాలని డిసైడ్ అయ్యారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ వెనకాల ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. విట్ కాలేజీ సమీపంలోని ఈ భూమిపై ఆయన ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ స్థలంలో భూమి పూజ ముహూర్తం ఏప్రిల్ 9గా నిర్ణయించారు. చంద్రబాబు ఇల్లు నిర్మించుకుంటోన్న ఈ స్థలం అమరావతి కోర్ క్యాపిటల్కి మధ్యలో ఉండడం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుందని అప్పుడే చర్చ మొదలయ్యింది.