తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయులు పలువురు నేతలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఎమ్మెల్యేలకు ఆయన సున్నితంగా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోకుంటే అందరం మునుగుతామని చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు పలు అంశాలపై సూచనలు, హెచ్చరికలు చేశారు. ఎమ్మెల్యేలు ఏది పడితే అది మాట్లాడవద్దని సూచించినట్లు సమాచారం. నేతల పనితీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానని చంద్రబాబు బాంబు పేల్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని, పనితీరును మార్చుకోవాలని హెచ్చిరించినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణంపై అందరూ ఫోకస్ పెట్టాలని సూచించారు.
రాష్ట్రం ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని ఎల్పీ సమావేశంలో చంద్రబాబు టీడీపీ నేతలకు తెలిపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన టీడీఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రోజు నుంచే కష్టపడి పని చేయాలని సూచించారు. నాయకులు, ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్నానన్న చంద్రబాబు.. అందరూ మళ్లీ గెలిచేలా పనిచేయాలని సూచించారు. త్వరలోనే కార్యకర్తలు, నేతలతో ప్రత్యేకంగా మాట్లాడుతానని.. పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాలని సూచించారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలపై ఫోకస్ పెట్టాలని నేతలకు సూచించిన చంద్రబాబు.. పార్టీని అలా వదిలేస్తే అందరం మునుగుతామని హెచ్చరించినట్లు సమాచారం.
అంతేకాకుండా.. ఎమ్మెల్యేలు అనవసరమైన విషయాలను మాట్లాడి.. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వొద్దని సూచించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు పొరపాటు మాట్లాడితే ప్రతిపక్షం అవకాశంగా మలుచుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు హెచ్చరించినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేలకు, కేడర్కు, ప్రజలకు మధ్య సమన్వయం కొరవడిందన్న చంద్రబాబు.. సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ సమస్యను అధిగమించాలని సూచించారు.
మరోవైపు.. ఏప్రిల్లోపు నామినేటెడ్ పదవులు పూర్తిగా భర్తీ చేస్తామని, సాధికార కమిటీ సభ్యులకే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చంద్రబాబు టీడీపీ నేతలకు తెలియజేశారు. మార్కెట్ యార్డులు, దేవస్థానాల బోర్డులలో నియామకాల కోసం పేర్లు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. అలాగే తెలుగుదేశం పార్టీలో పదవులను మహానాడులోపు పూర్తి చేయాలని నేతలకు స్పష్టం చేశారు. ఎక్కడా విభేదాలకు తావులేదన్న చంద్రబాబు.. గ్రూపులు సహించబోనని హెచ్చరించినట్లు సమాచారం.