మహారాష్ట్ర-తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రారంభించిన ప్రాజెక్టు. అంతఃరాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నదిపై బ్యారేజీని నిర్మించాలనే ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగింది. మహారాష్ట్రలోని చనకా గ్రామంలో, ఆదిలాబాద్లోని కొరాట గ్రామంలో 2016 సంవత్సరంలో రూ.386 కోట్ల అంచనా వ్యయంతో కొరాట- చనాక బ్యారేజి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పదేండ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బ్యారేజీ పూర్తి అయితే అదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో సుమారు 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. పదేండ్లు గడుస్తున్న పనులు ముందుకు సాగడం లేదు. బ్యారేజీకు సంబంధించిన నిధులు ప్రభుత్వం మంజూరు చేయగానే తిరిగి పనులు చేపడతామని అధికారులు చెపుతున్నారు.
చనాక బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి అయినప్పటికీ సాగునీటి కాలువల నిర్మాణ పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. హత్తి ఘాట్ పంప్ హౌస్ పనులను పూర్తి చేసి వెట్ రన్ నిర్వహించినా ఇప్పటి దాకా ఆయకట్టుకు చుక్క నీరుపారడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెడుతుందని భావించినప్పటికీ సంవత్సరం గడిచి పోయిందే తప్ప బ్యారేజీ కాలువల నిర్మాణపు పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఈ పనులు పూర్తి కావాలంటే మరో రెండేండ్ల సమయం పట్టే విధంగా కనిపిస్తోంది. అది కూడా పూర్తి స్థాయిలో నిధులు మంజూరు అయితేనే సాద్యం. నిధులు లేవన్న కారణంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని సమాచారం.
కాలువల పనులు ఆలస్యం కావడంతో నిర్మాణ పనుల అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంది. నిర్మాణ పనుల వద్ద పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి పోయి కనిపిస్తున్నాయి. మరోవైపు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణ పనులపై దృష్టి సారించి మిగిలిన పనులను త్వరిత గతిన పూర్తి చేసి ఆయకట్టుకు సాగు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
సదర్మాట్ బ్యారేజీ… అంతే సంగతులు
1892లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కంటే ముందు బ్రిటిష్ కాలంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ చెక్ డ్యాం పరిస్థితి మరీ ఘోరం. ఆధునీకరణ పేరుతో చేపట్టిన పనులు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామ సమీపంలో గోదావరిపై సదర్మాట్ స్టోరేజీ పెంపుదల పనులు 10ఏళ్లుగా నడుస్తూనే వున్నాయి. ప్రతియేటా రెండు పంటలకు నిరంతరాయంగా సాగునీరు అందించే సదర్మాట్ వర్షాకాలం పంటలకే పరిమితం అయ్యింది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.