ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశ సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత కఠినంగా మారాయి. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో యుద్ధ పరిస్థితిని తలపించేలా చర్యలు చేపట్టారు. రాజస్థాన్ రాష్ట్రంతో పాకిస్తాన్కు ఉన్న 1,037 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును పూర్తిగా సీల్ చేశారు. సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించే ఎవరినైనా కాల్చివేయొచ్చని భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో భారత వాయుసేన సైతం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మే 9వ తేదీ వరకు జోధ్పుర్, బికనేర్, కిషన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. గగనతలంలో యుద్ధ విమానాలు గస్తీ కాస్తుండగా, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను యాక్టివేట్ చేశారు.
అటు.. సరిహద్దు జిల్లాల్లో భద్రతను పటిష్ఠం చేస్తూ పంజాబ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిరోజ్పుర్, పఠాన్కోట్, ఫజిల్కా, అమృత్సర్, గురుదాస్పుర్, తరన్తరన్ జిల్లాల్లో 72 గంటల పాటు పాఠశాలలను మూసివేసింది. పోలీసు శాఖతో పాటు ఇతర భద్రతా విభాగాల సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ఇప్పటికే సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు.. పాకిస్తాన్ సైన్యం సాధారణ పౌరులు నివసించే ప్రాంతాలపై విరుచుకు పడుతోంది. కాల్పులకు తెగబడుతోంది. అయితే, పాక్ కుతంత్రాలకు భారత సైన్యం దీటుగా స్పందిస్తోంది. పాకిస్తాన్ దుశ్చర్యలకు ఇప్పటివరకు ఒక జవాన్తో పాటు 13 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు.
మంగళవారం అర్థరాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో చురుకైన దాడులు జరిపాయి. సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. దాదాపు 80 మంది ఉగ్రవాదులను హతమార్చారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు.