ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనులను ఆదివారం పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలోని చారిత్రాత్మకమైన ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించడానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మూడు కోట్ల 20 లక్షల రూపాయలతో అభిషేక మండపం, కళ్యాణ మండపం, వేదిక, కాటేజీలు, టాయిలెట్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ పరిసర ప్రాంతాలను కలియ తిరుగుతూ ప్రతి కట్టడాన్ని నిశితంగా పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి గురించి ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యే విధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రాందాసు నాయక్, డీసీసీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, పీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.