మహారాష్ట్ర రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయ్. ఇన్నాళ్లు అసలైన శివసేన ఎవరిది అనే ప్రశ్నకు తాజా ఎన్నికల ఫలితాలు జవాబు ఇచ్చాయని చెప్పవచ్చు.
శివసేన(ఠాక్రే) అధినేత ఉద్దావ్ ఠాక్రే కాంగ్రెస్ తో జత కట్టడం కరడు గట్టిన హిందువాదులను విస్మయానికి గురిచేసింది. బాల్ ఠాక్రే అభిమానులను నివ్వెరపరిచింది. శివసేన స్థాపించిన నాటి నుంచి అధికార పదవులను అమడ దూరంలో ఉంచారు బాల్ థాకరే. ఇందుకు భిన్నంగా ఉద్దావ్ థాకరే కాంగ్రెస్ తో జతకట్టి ముఖ్యమంత్రి అయ్యారు. తనయుడు అదిత్య థాకరేను కూడా ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి అప్పగించారు. ముఖ్యమంత్రిగా ఉద్ధావ్ థాకరే పార్టీ ఎమ్మెల్యేలకే కలిసేందుకు సమయం ఇవ్వలేదు. పార్టీ నేతలను అవమానించారని ఆరపణలు ఉన్నాయి. పార్టీ గుర్తు షిండే వర్గానికి వచ్చాక ఉద్దావ్ తన పార్టీ గుర్తు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని విశ్లేషణలు ఉన్నాయి.
పార్టీ అధికారంలో ఉన్నా క్యాడర్ బలోపేతం చేయటంలో విఫలమయ్యారు. పైగా వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ తో పొత్తులో తప్పులేదని ఘంటాపథంగా చెప్పటం పార్టీ శ్రేణులను మనస్తాపానికి గురిచేసింది. పార్టీ కాంగ్రెస్ కు బీ టీమ్ గా మారిందని శివసైనికులు మదన పడటం… అదే సమయంలో పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన ఏక్ నాథ్ షిండే వేరు కుంపటి పెట్టాడు. కాంగ్రెస్ పొడ గిట్టని థాకరే అభిమానులు ఉద్దావ్ కు దూరమయ్యారు. అదే సమయంలో సిఎం ఏక్ నాథ్ షిండేకు చేరువయ్యారు.
అధికారం కోసం కాదు.. హిందుత్వం కోసమే తిరుగుబాటు అని… బాల్ ఠాక్రే సిద్ధాంతాలను బతికించేందుకు అడుగు ముందుకు వేశామని షిండే చెప్పటాన్ని మహారాష్ట్ర ప్రజలు నమ్మారు. 18 ఏళ్లకే శివసేనలో చేరిన షిండే 15 ఏళ్లపాటు పార్టీకి సేవలందించాడు. 1997లో థానే మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచి పార్టీ నేతగా కొనసాగాడు. 2004లో థానే నియోజకవర్గం నుంచి గెలిచి ఆ తర్వాత కోపారీ-పఛ్పాఖ్డీ నియోజకవర్గం నుంచి ఏక్నాథ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ ప్రస్థానం 35ఏళ్లకుపైనే ఉంది.
సతారా జిల్లాలో జన్మించిన షిండే కుటుంబం థానేకు మారింది. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆటో డ్రైవర్ గా ప్రస్థానం ప్రారంభించారు. షిండేకు ముగ్గురు కుమారులు కాగా 2000 సంవత్సరంలో జరిగిన పడవ ప్రమాదంలో ఇద్దరు కుమారులు చనిపోయారు. చిన్న కుమారుడు శ్రీకాంత్ షిండే కళ్యాణ్ నియోజకవర్గం నుంచి మూడో దఫా ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
షిండే తక్కువగా మాట్లాడతారని పేరున్నా పనిమంతుడు అని కార్యకర్తలు చెప్పుకుంటారు. ప్రతిరోజు పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం.. వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండటం ఆయన ప్రత్యేకత. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా షిండే ఏనాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాఖలా లేదు.
షిండే తిరుగుబాటు… తాజా ఎన్నికల ఫలితాలతో మరాఠా రాజకీయాల ముఖ చిత్రం మారనుందని చర్చ మొదలైంది. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే.. శివసేన పరిస్థితి ఏంటా అని ! పార్టీ అస్థిత్వాన్నే దెబ్బతీసేలా కనిపిస్తున్నాయ్.
ఇటీవలి ఎంపి ఎన్నికల్లో మహాయుతి కూటమికి సీట్లు తక్కువ వచ్చినాా… శాసనసభ ఎన్నికల నాటికి కూటమి పుంజుకోవటం షిండే నాయకత్వం బలపడేలా చేసింది. తాజా ఎన్నికలతో మహారాష్ట్ర ప్రజలు ఏక్ నాథ్ షిండేనే బాల్ థాకరే వారసుడిగా గుర్తించినట్టు కనిపిస్తోంది.