మీడియాపై దాడి ఘటనలో సినీ నటుడు మంచు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద మోహనబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి నిన్న మీడియా వ్యక్తులు పెట్టిన కేసును నమోదు చేసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు మోహనబాబుపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో న్యాయ సలహా తీసుకున్న పోలీసులు తాజాగా సెక్షన్ మార్చి బీఎన్ఎస్ సెక్షన్ 109గా మార్చారు. గడచిన నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో ఉన్న మరస్పర్ధల కారణంగా ఆయన నివసించే జల్ పల్లి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని కుటుంబ పంచాయితీని రోడ్డుకీడ్చుకున్నారు. ఈ క్రమంలో జల్ పల్లి మోహన్ బాబు నివాసం వద్ద తలెత్తిన ఉద్రిక్త పరిస్ధితులను కవర్ చెయ్యడానికి వెళ్లిన మీడియాపై మంగళవారం రాత్రి మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో ఒక రిపోర్టర్ మొహంపై తీవ్ర గాయమై, శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్ధితి తలెత్తింది. ఈ నేపథ్యంలో మీడియా ఇచ్చిన ఫిర్యాదు కారణంగా పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.