- మౌనీ అమావాస్య ఘడియల్లో స్నానాలకు తహతహ
- అందరూ త్రివేణి సంగమం దగ్గరకే పరుగులు
- ఏర్పాట్లను మించి వచ్చిన భక్తులు
- బ్రహ్మ ముహూర్తంలో మునగాలన్న ఆరాటం
- త్రివేణి సంగమం సామర్ధ్యాన్ని పెంచినా నో యూజ్
- స్నానాలు చేసిన వారు వెనుదిరిగే దారి లేదు
- క్రౌడ్ హోల్డింగ్ సెంటర్లున్నా…ఫలితం లేదు
- ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ పెట్టడమే కారణమా?
- ఘటన తర్వాత ప్రయాగ రాజ్ నగరంలో ఆంక్షలు
- సంగమంలో స్నానాలు నిషేధ
ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో తొక్కిసలాటను చూస్తే మన గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన గుర్తుకొస్తోంది. ప్రయాగ్రాజ్ లో కూడా భక్తులందరూ ఒకే సారి స్నానానికి తొందర పడి పరుగులు తీయడంతోనే తొక్కిసలాట జరిగిందని యూపీ సీఎం చెబుతున్నారు. అదీకాక మౌనీ అమావాస్య ఘడియలు సమీపించిన వెంటనే త్రివేణి సంగమం దగ్గర పవిత్రస్నానం చేయాలని భక్తులు తహతహలాడారు. గంగ, యమున, సరస్వతి అనే మూడు దైవికబలం కలిగిన నదుల సంగమ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, మౌనీ అమావాస్య ఆరంభ ఘడియల్లో అదీ బ్రహ్మ మూహూర్తంలో మునకలేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి, మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. దాంతో ప్రయాగ్ రాజ్ లో కూడా భక్తులంతా ఒకేసారి అఖాడా మార్గ్ లో బారికేడ్లను దాటేసి పరుగులు తీశారు. కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన 200 ఘాట్ లను కాదని త్రివేణి సంగమం వైపే పరుగులు తీశారు. ఈ క్రమంలో ముందున్న వారు ముందుకు పడిపోయారు. వారి పైనుంచి తొక్కుకుంటూ, తోసుకుంటూ ఇతర భక్తులు పరుగులు తీయడమే తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది.
త్రివేణి సంగమ సామర్ధ్యాన్ని పెంచారు
మౌనీ అమావాస్యను పురస్కరించుకుని యూపీ ప్రభుత్వం త్రివేణి సంగమ స్థలి దగ్గర తీవ్రమైన రద్దీ ఉంటుందని ముందే ఊహించింది. సాధారణంగా వీఐపీలు, సెలబ్రిటీలు ఈ సంగమ స్థలి దగ్గర పవిత్ర స్నానాలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాన్ని మరింత విస్తరించి గంటకు 9 లక్షలమంది స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. దీనికోసం రెండు హెక్టార్ల ప్రాంతాన్ని చదును చేశారు కూడా.
మూడువైపుల మునిగే వీలు…
వాస్తవానికి యమునా నది గత ఆరేళ్లుగా తీవ్రమైన కోతకు గురవుతోంది. అది కూడా కుంభమేళా ఏర్పాట్లకు కలసి వచ్చింది. కుంభమేళా కోసం కోతకు గురైన ఆప్రాంతాన్నంతటినీ చదును చేశారు. దీంతో అక్కడ మరింత విశాలంగా తయారైంది. ఈ సంగమానికి మూడు వైపులనుంచి భక్తులు వచ్చే వీలు కల్పించారు. దీంతో ఈ ప్రాంతంలో గంటకు రెండు లక్షల మంది స్నానం చేసే వెసులు బాటు కల్పించారు.
ఎక్కడా భక్తులు నిలవకుండా ఎప్పటికప్పుడు స్నానాలు పూర్తి చేసుకుని వెనుదిరిగేలా ఏర్పాట్లు ఉన్నాయి. అయితే విఐపీలతో పాటు, సాధారణ జనం కూడా ఆ ప్రాంతం లో స్నానాలకే ఎగబడటంతో తొక్కిసలాటకు దారి తీసింది. ఊహించనంతమంది తరలి రావడం, అందరూ ఒకేసారి త్వరగా ముగించుకు వెళ్లాలన్న ఆతృత భక్తులను పరుగులు పెట్టించింది. దాంతో రద్దీని అదుపు చేయడం, కట్టడి చేయడం అధికారుల వల్ల కాలేదు.
ముహూర్త బలం… ప్రభావం
ఈ మొత్తం ప్రాంతానికి ఒకటే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్ ఉండటమే విపరీతమైన గందరగోళానికి దారి తీసిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. మౌనీ అమావాస్య ఘడియలు నిన్న రాత్రి 7.35 నిమిషాలకు ప్రవేశించాయి. ఈ పుణ్యఘడియలు రావడంతోనే ఘాట్లలో రద్దీ ఊహించినంత పెరిగిపోయింది. క్షణ క్షణానికీ అది పెరుగుతూ వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో దూర తీరాలనుంచి ఈ పుణ్య ఘడియల్లో సంగమంలో మునగడానికి జనం తరలి వచ్చారు. నిన్న సాయంత్రం 9 దాటిన దగ్గర నుంచి రష్ విపరీతంగా పెరిగిపోయింది. క్రమంగా ఒంటి గంట అయ్యే సరికి ఇక జనం ఎటు వెళుతున్నారో ఆ స్థలంలో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలేవో తెలియనంతగా జనం కమ్మేశారు. క్రౌడ్ కంట్రోల్ చేయడానికి క్రౌడ్ హోల్డింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసినా ఉపయోగం లేకపోయింది. పెద్ద పెట్టున జనం తోసుకుంటూ వచ్చేయడం ఘాట్ లలో స్నానాలు ముగించుకుని వెనకకు వెళ్లాలసిన వారికి బయటకు వెళ్లే మార్గం లేదు. ఎటు వైపు వెళ్లాలో, ఎటు గేటు ఉందో కూడా తెలీలేదు. ఎటు చూసినా అంతా జనం జనం… పైగా తమ లగేజిలు, బ్యాగేజీలు నెత్తిన పెట్టుకుని మరీ కదులుతుండటంతో కనుచూపు మేరలో ఎగ్జిట్ గేటు ఎక్కడుందో తెలీలేదు.
జన సముద్రంలో ఉన్న అనుభూతి…
తాను జన సమూహంలో చిక్కుకు పోయి, ఏం జరుగుతోందో తనవారెక్కడున్నారో తెలీలేదని ఓ భక్తుడు వాపోయాడు. తాము ఐదుగురు వచ్చామని, ఈ రద్దీలోనే చెల్లా చెదురు అయిపోయామని ఆతడు విలపిస్తూ చెప్పాడు. తన కళ్ల ముందే మహిళలు, వృద్ధులు కింద పడిపోయారని, వారిపై నుంచి జనం తొక్కుకుంటూ వెళిపోయారని చెప్పాడు. ఘాట్ లనుంచి భక్తులు బయటకు వెళ్లడానికి సైన్ బోర్డులు లేవని, కనీసం అనౌన్స్ మెంట్లు కూడా లేవని అన్నాడు.
అందరూ ఎవరిని వారిని ఏదో వైపు గుడ్డిగా నెట్టేసుకోవడంతో ఓ అరగంట పాటూ అసలు ఊపిరాడక, ఏం జరుగుతోందో తెలీలేదన్నాడు. తొక్కిసలాట నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగాలు బాధితులు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. 75 అంబులెన్సులు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఈ సంఘటనలో మృతులెంతమంది అన్నది ఇంకా తెలియటం లేదు. ప్రయాగ్రాజ్ నగరంలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. జనం రద్దీ మరింత పెరిగి అది పొరుగు గ్రామాలకు విస్తరించే ప్రమాదం ఉండటంతో త్రివేణి సంగమం దగ్గర దారులు మూసేశారు. అక్కడ స్నానాలకు వీలు లేదని ప్రకటించారు.
నాగసాధువుల స్నానాలు రద్దు
దుర్ఘటన నేపధ్యంలో నాగసాధువులు, 13 అఖాడాల సాధు సంతులు తమ స్నానాలను రద్దు చేసుకున్నారు. పౌర్ణిమ నాడు వారు పవిత్ర స్నానం ఆచరిస్తామని ప్రకటించారు.