- పెట్టుబడుల వేట కోసం కోట్లల్లో ఖర్చు
- మూడు మీడియా సంస్థలకు లక్షల్లో వర్క్ ఆర్డర్లు
- అదానీ మీడియాకు, సిఎన్ బిసీ నెట్ వర్క్, ఇండియా టుడే గ్రూప్ కు కాంట్రాక్టులు
- మూడు వేర్వేరు జీవోలు రిలీజ్..
- ఈ పబ్లిసిటీ ఖర్చు దాదాపు మూడు కోట్ల పైమాటే
- ఎలాంటి ఆర్భాటం లేకుండా వెళ్లిన తెలంగాణ సీఎం
- లక్ష కోట్ల టార్గెట్ గా అడుగులేస్తున్న రేవంత్ బృందం.
స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు లో తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు సాధించేందుకు ఇరువురు సీఎంలు చేరుకున్నారు. అయితే ఇక్కడ పెట్టుబడుల వేటలో ఎవరి స్టైల్ వారిదే. తెలంగాణ సీఎం ప్రచారార్భాటాలకు దూరంగా లక్ష కోట్ల టార్గెట్ పెట్టుకుని రంగంలోకి దిగితే… ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం యధాప్రకారం తన మీడియా స్ట్రాటజీని ముందుపెట్టారు. ఆమాటకొస్తే తాను ఎక్కడ ఏం చేసినా మీడియా కనుసన్నల్లో పబ్లిసిటీ అయ్యేలా జాగ్రత్త పడుతుంటారు చంద్రబాబు. తన పాలనకు టెక్నాలజీని, సాంకేతికతను జోడిస్తూ, తాను టెకీ శావీననీ అందరికీ తెలియాలని ఆరాటపడుతుంటారు. ఏపీకి పెట్టుబడులు తెచ్చే పేరుతో మరో భారీ పబ్లిసిటీకి ఈసారి చంద్రబాబు ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది. ఏకంగా మూడు మీడియా సంస్థలను వెంటేసుకు మరీ దావోస్ చేరుకుంది.
పెట్టుబడులకోసం పెట్టుబడి…
బ్రాండ్ ఏపీ పేరిట రాష్ట్రంలో పెట్టుబడులు, ప్రాజెక్టులు పెట్టేందుకు అనువైనవాతావరణం ఉందని ఇండస్ట్రియలిస్టులు, వాణిజ్యవేత్తలకు వివరించి భారీ పెట్టుబడులను తీసుకురావాలన్నది లక్ష్యం. ఏపిలో పరిశ్రమల స్థాపనకు అనేక పాలసీలు చేపట్టామని, కొత్తతరం విద్యావంతులు ఉద్యోగాలు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని పారిశ్రామికవేత్తలను కన్విన్స్ చేసి పెట్టుబడులు తీసుకొచ్చే ఉద్దేశంతో చంద్రబాబు బృందం నాలుగురోజుల పాటు దావోస్లో వాణిజ్యవేత్తలను ఆకర్షించే ప్రయత్నంచేస్తుంది. అయితే దీనికంతటికీ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకోవడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్లారు చంద్రబాబు.
ఆ మూడు మీడియా సంస్థలకు కోట్లల్లో పందేరం…
ఈసారి పెట్టుబడుల ఆహ్వానంతో పాటు ఏపీ బ్రాండ్ ప్రమోషన్ పేరిట పబ్లిసిటీ కోసం నిధులు విడుదల చేస్తూ ఏకంగా జీవోలే జారీ అయ్యాయి. దాదాపు నాలుగు మీడియా సంస్థలకు కోట్లల్లో సొమ్మును రిలీజ్చేస్తూ జీవోలు విడుదల చేశారు. సీఎన్ బీసీ నెట్ వర్క 18, ఎన్డీటీవీ, ఎన్డీటీవీప్రాఫిట్, బిజినెస్ టుడే, చానెళ్లకు అన్నింటకీ కలిపి కోట్ల కొద్దీ రూపాయలు పబ్లిసిటీ ఖర్చులకు చెల్లిస్తున్నారు. దీనిలో సింహభాగం సీఎన్ బీసీ నెట్ వర్క్ 18 ఛానెల్ కు విడుదల చేశారు. ఈ ఛానెల్ కు ఏకంగా కోటీ 15 లక్షల రూపాయల సొమ్ము విడుదల చేయగా, ఆ తర్వాత స్థానం అదానీ గ్రూప్ అయిన ఎన్డీటీవీ మీడియాది. ఈ బొకే నుంచి రెండు ఛానెళ్లు అంటే ఎన్డీటీవీ మీడియా, ఎన్డీ టీవీ ప్రాఫిట్ ఛెనెళ్లకు ఏపీ గురించి పబ్లిసిటీ చేసేందుకు రూ.74 లక్షల 34వేల రూపాయలు కట్టబెట్టారు. ఆ తర్వాత నోయిడా కు చెందిన ఇండియా టుడే గ్రూప్ కు చెందిన బిజినెస్ టుడే గ్రూప్ కు రూ.61 లక్షల 50 వేల రూపాయలు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సంస్థ నుంచి విడుదల చేస్తున్నట్లుగా జీవోలు రిలీజ్ చేశారు. బిజినెస్ టుడే గ్రూప్ నుంచి ఎడిటర్ సిద్ధార్ధ్ జరోబీ, మోడరేటర్ గా సీఎన్బీసీ నెట్వర్క్ 18 మేనేజింగ్ ఎడిటర్ షెరీన్ భాన్ కూడా ఈ సదస్సుల్లో పాల్గొంటున్నారు.
దావోస్ సమ్మిట్ సహ పార్ట్ నర్ గా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లుగా బ్రోచర్లలో ఉంది. పునరుత్పాదక ఇంధన వనరులపైనా, ఏఐ టెక్నాలజీపైనా, బ్లూ ఎకానమీ అంశాలపైనా జరిగే ఈ సదస్సులను ఈ మీడియా ఛానెళ్లు నిర్వహిస్తాయి..
గతంలోనూ చంద్రబాబు, లోకేష్ 2019లో ఇలాగే దావోస్ సదస్సు పెట్టుబడులు తెస్తాం అంటూ హడావుడి చేశారు. కోట్లలో ఖర్చు చేశారు. మరి అప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయో తెలీదు కానీ ఈసారి దావోస్ పర్యటనకు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. దీనిలో చంద్రబాబు వెంట లోకేష్ తో పాటు పెద్ద బృందమే వెళ్లింది. వెళ్లారు. రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వస్తాయో,ఎన్ని పరిశ్రమలు వస్తాయో తెలీదు కానీ ఈసారి ప్రైవేట్ మీడియా ప్రచారానికి, పబ్లిసిటీకి మాత్రం కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఇమేజ్ తో పెద్ద పెద్ద ఆంగ్ల వ్యాసాలు, బ్రోచర్లు రిలీజ్ అయ్యాయి. ఏపీ రాష్ట్రం గురించి భారీ పబ్లిసిటీ ఇస్తున్నారు.
తెలంగాణలో అలా…
ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడం పేరుతో ఇంత భారీ పబ్లిసిటీకి తెర తీస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం లక్ష కోట్ల టార్గెట్గా దావోస్ ట్రిప్కు బయల్దేరింది. సీఎం రేవంత్ వెంట ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఇప్పటికే సింగపూర్ మూడు రోజుల టూర్ సక్సెస్ అయిందంటున్న రేవంత్ బృందం ఇక దావోస్లో కూడా తమ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయన్న ఆశాభావంతో ఉంది. గతేడాది దావోస్ ట్రిప్ లో తెలంగాణకు 40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు. ఈసారి మరింత ఎక్కువ సాధించాలనే లక్ష్యంతో అడుగులేస్తున్నట్లు రేవంత్ తెలిపారు. కేవలం ఒప్పందాల వరకే కాకుండా అవి గ్రౌండ్ అయ్యేలా ప్రయత్నిస్తామని తెలంగాణనేతలు అంటున్నారు. తెలంగాణ బృందం వెంట ఎలాంటి మీడియా లేదు.