గుజరాత్లో జరుగుతున్న ఏఐసిసి విస్త్రత స్థాయి సమావేశంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో పార్టీ తరపున బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని తీర్మానం చేసింది. రాజ్యాంగబద్దమైన పదవుల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహూల్గాంధీ కొద్ది రోజులుగా బలంగా వాదిస్తున్నారు. కాంగ్రెస్ బీసీలకు అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని అవకాశం దొరికినపుడల్లా పార్టీ శ్రేణులకు ఉద్భోదిస్తున్నారు.
కాంగ్రెస్ కేవలం మైనారిటీలు, దళితులకే పరిమితమైందని బీసీ వర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని రాహూల్గాంధీ యోచిస్తున్నారు. బిజెపి సోషల్ ఇంజనీరింగ్ ద్వారానే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. బిజెపిని దెబ్బ కొట్టేందుకుఒక అడుగు ముందుకేసిన రాహూల్గాంధీ ఏకంగా రిజర్వేషన్ సూత్రాన్ని ముందుకు తీసుకొచ్చారని విశ్వసనీయ సమాచారం.
కాంగ్రెస్ తాజా నిర్ణయంపై పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రిజర్వేషన్ అమలు జరిగితే అగ్రవర్ణాల్లో అనేక మంది నాయకులు గ్రామ స్థాయిలో డమ్మీ అవుతారు. పార్టీ నాయకత్వం దీనిపై పునరాలోచన చేయాలని అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇక్కడి నుంచే అమలు చేయాలని పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని విశ్లేషణ జరుగుతోంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కూడా ఈ కోణంలోనే వాయిదా పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కొత్త ఆలోచన చేస్తు్న్నట్టు సమాచారం. బిసి రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థలకే కాకుండా ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ, ఎంపి సీట్లకు కూడా వర్తింప చేయాలని కోరుకుంటున్నారు.
కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ నిర్ణయం పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందేమో కానీ రాబోయే రోజుల్లో ఈ హామీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుందనటంలో సందేహం లేదు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ… ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో… ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. బిసీ రిజర్వేషన్పై సరైన కార్యచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. లేదంటే పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని హస్తం సీనియర్ నేతలు నాయకత్వానికి వివరిస్తున్నారు.