పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న ఏపీ డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ నివాసానికి మంగళవారం అల్లు అర్జున్ సతీ సమేతంగా వెళ్ళారు. సింగపూర్ లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ సీయం పవన్ తో పాటు ఆయన అన్న చిరంజీవి దంపతులు సైతం సింగపూర్ వెళ్ళారు. మార్క్ శంకర్ వైద్య చికిత్స పూర్తయిన వెంటనే గత శనివారం అతన్ని తీసుకుని పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హైదరాబాద్ వచ్చారు. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ని పరామర్శించడానికి మంగళవారం అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహారెడ్డిలు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. అయితే గత కొంత కాలంగా అల్లు, మెగా కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్యలో అప్రకటిత వార్ కొనసాగుతూనే ఉంది. ఈ ప్రచారాన్ని బలపరుస్తూ అనేక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పుష్ఫ-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య ధియేటర్ తొక్కిసలాట తదనంతరం జరిగిన పరిణామాల తరువాత చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ అల్లు అర్జున్ని పరామర్శించారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పలకరించలేదు. అయినా అల్లు, మెగా కుటుంబాల్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా అశుభకార్యాలు జరిగినా ఇరు కుటుంబాలు పరస్పరం కలుసుకుని తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పకనే చెపుతాయి. తాజాగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క శంకర్ కు జరిగిన ప్రమాదం పట్ల అటు మెగా ఇటు అల్లు కుటుంబాలు కూడా తల్లడిల్లిపోయాయి. అందుకే మార్క్ శంకర్ హైదరాబాద్ వచ్చిన వెంటనే అతన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ కుటుంబంతో సహా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళారు.