అమెరికా ఇప్పటికే 104 మంది అక్రమ వలసదారులను భారత్కు వెనక్కి తిప్పి పంపింది. అయితే ఈ నెంబర్ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. మొత్తం 487 మందిని అమెరికా వెనక్కి పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ అధికారికంగా ప్రకటించింది. వీరందరిని కూడా త్వరలోనే భారత్కు పంపనుంది అమెరికా. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా తమకు సమాచారం అందించిందని తెలిపింది విదేశాంగశాఖ.
అయితే వీరందరిని ఎప్పుడూ పంపుతారు? ఎలా పంపుతారు? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మొదటి విడదలో పంపిన 104 మంది విషయంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కోంటోంది. 40 గంటలకు పైగా విమానంలో ఉంచడం.. వారి కాళ్లకు, చేతులకు సంకేళ్లు వేయడం వంటి విషయాలు కలకలం రేపాయి. ఇప్పుడు పంపే వారిని కూడా ఇదే విధానంలో పంపితే కేంద్రం మరోసారి విమర్శలు ఎదుర్కోక తప్పదు.
అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన తర్వాతే మరో బ్యాచ్ అక్రమవలసదారులను పంపే అవకాశం ఉంది. అయితే ఈలోపు ఇరు దేశాధినేతలు ఈ అంశంపై చర్చించే అవకాశం ఉండటంతో కొంత ఊరట లభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
భారతీయులకు సంకెళ్లు వేసి పంపడంపై అమెరికా వద్ద తమ ఆందోళనను వ్యక్తం చేసినట్టు విదేశాంగశాఖ తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతామన్నారు. అక్రమంగా అమెరికా వెళ్లినట్లు గుర్తించిన భారతీయులను సురక్షితంగా తీసుకువస్తామన్నారు. అయితే అమెరికా ఈ మొత్తం వ్యవహారాన్ని నేషనల్ సెక్యూరిటీ ఆపరేషన్గా భావిస్తుందని తెలిపింది విదేశాంగశాఖ.