కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ పర్యటనపై అమిత్ షాకు ఏపీ సీఎం ఫిర్యాదు..
తిరుమల పర్యటనను రద్దు చేసుకోవాలని అమిత్ షా ఆదేశం..
ఏపీలోని కూటమి ప్రభుత్వం తన పరువును కాపాడుకుంది. తిరుమల వ్యవహరాల్లో కేంద్ర జోక్యం లేకుండా నివారించగలిగింది. ఇటీవల తిరుమల-తిరుపతిలో తొక్కిసలాట, లడ్డూ ప్రసాదం కౌంటర్లో అగ్ని ప్రమాదం ఘటనలపై కేంద్రం సీరియస్సుగా ఉందని.. భద్రత, క్రౌడ్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై పరిశీలించేందుకు కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ వస్తున్నారని.. టీటీడీలో భద్రత సహా క్రౌడ్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై అధికారులతో సమావేశమవుతారని కేంద్ర హోం శాఖ నుంచి టీటీడీ ఉన్నతాధికారులకు.. టీటీడీ ఛైర్మనుకు లేఖలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహరం సంచలనంగా మారింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి కేంద్రం జోక్యం చేసుకుంటోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రతిపక్ష వైసీపీ విమర్శలు కూడా సంధించింది. అయితే ఉన్నట్టుండి కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ పర్యటన రద్దు అయింది. ఈ మేరకు టీటీడీ ఈవోకు కేంద్ర హోం శాఖ నుంచి లేఖ కూడా అందింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పాటు.. టీటీడీ పాలకమండలి కూడా ఊపిరి పీల్చుకుంది.
అసలు తెర వెనుక ఏం జరిగిందంటే.. కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ జిందాల్ పర్యటనకు ముందు రోజు రాత్రి అమరావతికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా అమిత్ షా.. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో టీటీడీలో జరిగిన వరుస ఘటనలపై సమీక్షించేందుకు కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ వస్తున్నారనే అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం చంద్రబాబు. ఇది జరిగితే కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని.. ఎన్నడూ లేని విధంగా తొలిసారి కేంద్రం జోక్యం కూటమి ప్రభుత్వంలోనే జరిగిందనే అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందనే వివరించారు. ఇది రాజకీయంగా చాలా ఇబ్బందులను కొనితెస్తుందని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సిందిగా అమిత్ షా తన శాఖకు చెందిన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. దీంతో టీటీడీలో కేంద్రం జోక్యం అనే అంశం తప్పి పోయింది.