- తీర్పు వెలువరించిన కోల్కతా సెషన్స్కోర్టు
- సోమవారం శిక్ష ఖరారు
ఆర్జీకర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను కోల్కతా సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. తుది తీర్పు సోమవారానికి వాయిదా వేశారు. భారతీయ న్యాయ సంహింత 64,66, 103(1) సెక్షన్ల కింద సంజయ్ రాయ్పై అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. దీనిపై కోల్కత సెషన్స్ కోర్టులో నవంబర్ 12వ తేదీ నుంచి తుది విచారణ ప్రారంభమయ్యి జనవరి 9న ముగిసింది. అయితే తనను ఈకేసులో ఇరికించారని తనకూ ఈకేసుకీ ఎటువంటి సంబంధం లేదని ఆర్జీ కార్ కేసు నిందితుడు సంజయ్ రాయ్ కోర్టులో పేర్కొన్నాడు. సోమవారం మాట్లాడే అవకాశం ఇస్తామని అప్పుడు మాట్లాడమని న్యాయమూర్తి చెప్పారు. ఈ కేసులో దోషిగా నిర్ధారించిన తరువాత కనీసం జీవితఖైదు శిక్ష పడవచ్చని, మరణశిక్ష కూడా పడే అవకాశం ఉందని కోర్టు సంజయ్రాయ్కి తెలిపింది. గతేడాది ఆగస్టు 9న ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం మరియు హత్య కేసులో కోల్కతా పోలీసు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ను నిందితుడిగా గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోల్కతాలోని కోర్టు శనివారం దోషిగా నిర్ధారించింది. సెషన్స్కోర్టు రూమ్ నెంబర్ 210లో న్యాయమూర్తి అనిర్బన్దాస్ ఈ తీర్పు వెలువరించారు. న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, వైద్యులుతో కోర్టు ఆవరణ కిక్కిరిసిపోయింది. దేశం యావత్తు ఈ కేసు తీర్పు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. నువ్వు ఆసుపత్రిలోకి ప్రవేశించి, బాధితురాలిపై దాడి చేసి, అత్యాచారం చేసి, హత్య చేశావు అని అందువల్ల నిన్ను దోషిగా ప్రకటిస్తున్నాము అని సంజయ్రాయ్ని ఉద్దేశించి న్యాయమూర్తి అనిర్బన్దాస్ వ్యాఖ్యానించారు.