- బూమ్రాకి రెస్ట్…మహ్మద్ షమీకి చోటు
- సూర్యకుమార్ పై గంపెడాశలు
అందరూ ఏదైతే అనుకున్నారో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆ జట్టును బీసీసీఐ ప్రకటించలేదు. ఎప్పుడూ ఆడే పాత చింతకాయ జట్టు ఏదైతే ఉందో, అదే ఇంగ్లండ్ తో జరిగే ఐదు టీ 20లకు ప్రకటించారు. అయితే అందరూ ఈసారైనా ఆడతాడా? లేదా? అని ఎదురుచూసే 2023 వన్డే వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ట్రంప్ కార్డ్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చారు.
నిజంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ 20 జట్టు అద్భుతంగా ఆడుతోంది. అప్రతిహితంగా విజయాలు సాధిస్తోంది. అందుకని ఆ జట్టుని టచ్ చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎక్కువగా సాహసం చేయలేదు.
కాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే ముందు మహ్మద్ షమీకి ఒక అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఫిట్ నెస్ నిరూపించుకుంటే ఎప్పటిలా భారతజట్టుకి ఆడేందుకు లైన్ క్లియర్ అవుతుంది. జనవరి 22 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్ తో టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ 20 జట్టు సభ్యులను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, తిలక్ వర్మ, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ ఉన్నారు.
అయితే, చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ , అలాగే సాయి సుదర్శన్ కి అవకాశం దక్కలేదు. ఇకపోతే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కి పిలుపు అందలేదు. మరోవైపు టెస్టు జట్టులో కీలక ఆటగాళ్ల వైఫల్యంతో సతమతమవుతున్న టీమ్ ఇండియా ఇప్పుడు సూర్యకుమార్ పై గంపెడాశలు పెట్టుకుంది.