– వ్యవసాయ శాఖ వద్దంటూ ఉన్న తుమ్మల
– టూరిజ కి నో చెప్తున్న జూపల్లి
– దేవాలయాలు చూసుకో లేనంటున్న కొండా సురేఖ
తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు తమ శాఖలు మార్చాలని పట్టుపడుతున్నట్లుగా తెలుస్తోంది.. ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని కొందరు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కీలకమైన కొన్ని శాఖలకు ఇప్పటికీ మంత్రులు లేరు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందనే అంశంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది కాలం పూర్తయినప్పటికీ విస్తరణ జరుగుతుందా? లేదా? అనే అంశంపై ఇటు రాష్ట్ర నాయకత్వం గానీ అటు కేంద్ర నాయకత్వం గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. విస్తరణ జరిగితే తమ శాఖలను మార్చుకోవాలని భావించిన నేతలు ఇక విస్తరణను వదిలేసి శాఖలు మార్పు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలంగాణలో కొన్ని కీలకమైన శాఖలు ఇప్పటికి ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోం శాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలకు ఇప్పటికీ ప్రత్యేకంగా మంత్రులు లేరు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీటిని కూడా ప్రస్తుతం చూసుకుంటున్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే ఈ మూడు ముఖ్యమైన శాఖలకు మంత్రులు లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాశాఖ మంత్రి కొండ సురేఖలు ప్రస్తుతం తమ శాఖలను మార్చాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లుగా తెలిసింది. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు మొదటి నుంచి ఈ శాఖ పట్ల ఆసక్తి గా లేరు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు.. ఎక్కువ కాలం రోడ్లు, భవనాల శాఖ మంత్రి గానే కొనసాగారు. రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ ఆయనను ఆర్ అండ్ బి శాఖ మంత్రి అనే అంటుంటారు. ఒకవేళ ఈ శాఖ ఇవ్వడానికి అవకాశం లేకపోతే మరేదైనా శాఖను తనకు కేటాయించాలని తుమ్మల మొదటినుంచీ కోరుతున్నారు.
ఇక జూపల్లి కృష్ణారావు విషయానికి వస్తే టూరిజం తో పాటు ఎక్సైజ్ శాఖ ఆయన చూస్తున్నారు. టూరిజం సెంటిమెంట్ గా తనకు వద్దనే అభిప్రాయంతో జూపల్లి ఉన్నట్టుగా తెలిసింది. టూరిజం కాకుండా మరో శాఖ కేటాయించాలని కోరుతున్నారు.
ఇటు.. కొండా సురేఖ విషయానికొస్తే దేవాదాయ శాఖ మంత్రి ఎప్పుడు సెంటిమెంట్ గా కలిసి రాదనే అభిప్రాయంతో ఆమె ఉన్నారు. ఎందుకంటే ఈ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో గెలవరన్న ప్రచారంతో పాటు.. రాజకీయంగా కూడా ఇబ్బందులు పడతారని అభిప్రాయం చాలా యేళ్లుగా ఉంది.
అయితే శాఖలు మార్పు ప్రత్యేకంగా ఇప్పట్లో జరిగే అవకాశం లేదని కొందరు అంటున్నారు. నెలరోజుల పాటు ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ ఎన్నికల తర్వాతే అధిష్టానం దీనిపై దృష్టిసారించే అవకాశం ఉందంటున్నారు.