కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామి వారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందామని వెళ్తే.. ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష వినిపించేలా చేశారని ధ్వజమెత్తారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శన సమయంలో లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ పాలనా యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమని ఆక్షేపించారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన భక్తుల కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఏపీసీసీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామన్నారు.
మొన్నటికి మొన్న లడ్డూ కల్తీ వ్యవహారం.. ఇప్పుడేమో తొక్కిసలాట దుర్ఘటనలు కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.