తనపై కుట్రపూరితంగా నమోదు చేసిన ఏసీబీ కేసు విషయంలో బీఆర్ఎస్ క్యాడర్ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాను ఆ కేసు గురించి అసలు ఆలోచించడం లేదని, ఎవరికీ భయపడేది లేదన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీని ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన సమయంలో ఇబ్బందులతో పోలిస్తే ఇప్పటివి పెద్ద లెక్క కాదన్నారు. మనకేదో ఇబ్బంది ఉందనుకుంటున్నారని, అలాంటి ఇబ్బంది ఏమీ లేదని అందరూ గుర్తించాలన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాన్నారు. కేసులు అసలు సమస్యే కాదన్నారు. ఈ కేసుపై తాను పోరాడతానని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ బిడ్డగా, ఆయన తయారు చేసిన సైనికుడిగా ఎంతో ధైర్యంగా ఉంటానన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు నెలకు 2వేల 500 రూపాయలు ఇస్తున్నారని ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారన్నారు. రైతు భరోసా విషయంలో కూడా రైతులకు రేవంత్ సర్కారు చేస్తున్న మోసాలను వివరంగా చెబుతామన్నారు.